అనంతలో కులగజ్జి చిచ్చు: జేసీ వర్సెస్ ప్రభాకర్ మాటల తూటాలు
అమరావతి: అనంతపురంలో అంటువ్యాధులు ప్రబలడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యమే కారణమంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన విమర్శలు ఇద్దరి మధ్యా మాటల వేడిని రాజేశాయి. జేసీ వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
తాను అన్ని రకాల ప్రజలకు ప్రతినిధినని, ముఖ్యంగా అణగారిన వర్గాలకు ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. అయితే ఎవరైనా ప్రబుద్ధులు తనకు కులగజ్జిని అంటించాలని చూస్తున్నారని జేసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
జేసీ దివాకర్ రెడ్డి కులగజ్జి వ్యాఖ్యలపై 'అనంత' మేయర్ గట్టి కౌంటర్
ఎవరైనా ఆకాశం మీద ఉమ్మెస్తే తరిగి వాళ్లపైనే పడుతుందని అన్నారు. 'యద్భావం తద్భవతే' ఆయన భావన ఏదైతే ఉందో ఎదుటి వారికి కూడా అదే భావన ఉంటుందనే భావనలో ఆయన ఉన్నారని అన్నారు. పచ్చకామెర్లతో ఉన్న వ్యక్తికి దేశమంతా పచ్చకామెర్ల మాదిరే కనిపిస్తుందని సామెతను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆయన డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి అని, రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి అంటూనే కాస్తంత వ్యంగంగా మాట్లాడారు. అన్ని హోదాల్లోను పని చేసిన వ్యక్తి అని, ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి జేసీ క్రమశిక్షణతో మెలగాలని, మాట్లాడే ముందు సయంమనం పాటించాలని ప్రభాకర్ చౌదరి సున్నితంగా హెచ్చరించారు.
కాగా, కులపిచ్చి, బంధుప్రీతిల వల్లే అనంతపురం నాశనమవుతోందని ఆదివారం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. నగర పాలక సంస్థలో ఒక సామాజిక వర్గం కొనసాగిస్తున్న పరిపాలన వల్లే పరిస్థితి ఇంత ఘోరంగా తయారైందని ఆగ్రహించారు. ఆదివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అనంతలో పందుల కారణంగా చిన్నారులు చనిపోతున్నారన్నారు. తాను ఏ మంచి కార్యక్రమం చేపడదామన్నా అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే రెండో అత్యుత్తమ మున్సిపాలిటీగా తాడిపత్రిని తీర్చిదిద్దామన్నారు. డివైడర్లు అంటూ అనవసర ఖర్చు పెట్టి ఉన్న నిధులు స్వాహా చేశారని ఆరోపించారు.