రేవంత్ రెడ్డికి నేనే డబ్బిచ్చానని అనలేదు: జగన్, నువ్వు మాట్లాడవా: బాబు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య మంగళవారం శాసనసభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చింది తానే అని చంద్రబాబు చెప్పడం లేదని, అలాగే ఆడియో వీడియో టేపుల్లో మాట్లాడింది తానేనని చెప్పలేదని, అందుకు చాలా సంతోషమని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసిన ప్రకటనపై జగన్ మాట్లాడుతున్న సమయంలో ఆ వాగ్వివాదం జరిగింది. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల రూపాయలు పెట్టడానికి సిద్ధపడ్డారని జగన్ అన్నారు. ఫొరెన్సిక్ రిపోర్టులు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక హోదాను ఫణంగా పెట్టి ప్రధాని మోడీ వద్ద చంద్రబాబు సాష్టాంగపడ్డారని చెప్పడానికి నోటుకు ఓటు కేసును తాను ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
జగన్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. బురద పూసుకున్నవారికి బాధ లేదు, ఇతరులపై బురద చల్లాలని చూస్తున్నారని ఆయన అన్నారు. జగన్ నాన్న మీద తాను రాజకీయం చేశానని, 1975 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానని, తనపై సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, తాను నీతీనిజాయితీగా ఉన్నాను కాబట్టే తనను ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు.

తెలంగాణలో ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి తమకు 20 మంది శాసనసభ్యులున్నారని, కావాల్సింది 17 మంది మాత్రమేనని, అయితే తమ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లాక్కుందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపించకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రిని చేశారని, అది ప్రలోభం కాదా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను కూడా తీసుకున్నారని, అది లాలూచీ కాదా అని చంద్రబాబు అన్నారు.
ఎవరికీ ఫోన్లు చేయాల్సిన అవసరం తనకు లేదని, హైదరాబాదులో తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని, ఫోన్ల్ ట్యాప్ చేస్తే నువ్వు ఆ విషయం మాట్లాడవా, అది లాలూచీ కాదా అని ఆయన జగన్ను ఉద్దేశించి అన్నారు. తనపై 24 గంటలు కుట్ర పన్నుతున్నారని చెప్పడానికి నిదర్శనం కాదా అని ఆయన అన్నారు. జగన్, టిఆర్ఎస్ కలిసినా తనను ఏమీ చేయలేరని ఆయన అన్నారు. ప్రధానికి తాను భయపడుతున్నట్లు చెప్పి ప్రజల్లో సందేహం కలింగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్సించారు.
తనతో పెట్టుకున్నవాళ్లను చాలా మందిని చూశానని, తన వైపు ధర్మమూ న్యాయమూ ఉన్నాయని, జగన్ చేసినటువంటి పనులు తాను చేయబోనని ఆయన అన్నారు. టిఆర్ఎస్ కాపీ రాసిస్తే జగన్ చదువుతున్నాడని, రాజకీయ ప్రయోజనం కోసం విషయం నుంచి పక్కకు తొలుగుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రిపై కేసు పెడితే స్పందించాల్సింది పోయి జగన్ తనపై నిందలు వేస్తున్నారని, సెక్షన్ 8 ప్రకారం తమకు హక్కు ఉందని ఆయన అన్నారు. మన ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి తెలంగాణ పోలీసులు వచ్చారని, అటువంటి స్థితిలో ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications