చంద్రబాబు, జగన్ కుమ్మక్కు...టిడిపి-వైసిపి ఉమ్మడి ప్రభుత్వం:కన్నా సంచలన వ్యాఖ్యలు
తూర్పుగోదావరి:రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. కాదని చంద్రబాబు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు, జగన్ కుమ్మక్కై ఎపిలో ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం వాస్తవమని, ఆ ఇద్దరూ ఎవర్ని మోసం చేస్తారని కన్నా వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, అది సంకీర్ణ ప్రభుత్వం కాదా? అని కన్నా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు నిజం మాట్లాడడం తెలియదని, తమకు అబద్దాలు మాట్లాడడం చేతకాదని ఆయన అన్నారు. రాజమండ్రిలో బిజెపి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసాను కేంద్రం చెల్లించిందని కన్నా చెప్పారు. పాతరేట్లకే నవయుగ కంపెనీతో పనులు చేయిస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. పోలవరంపై సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలు అవాస్తవాలేనని కన్నా దుయ్యబట్టారు. అనంతరం మరో బిజెపి నేత
పురందేశ్వరి మాట్లాడుతూ పోలవరం ఏపీకి ప్రధాని మోదీ ఇచ్చిన వరమని అన్నారు. పోలవరం ఆంధ్రుల దీర్ఘకాలిక స్వప్నమని ఆమె వ్యాఖ్యానించారు. విభజన బిల్లులో ఉన్న ఏడు మండలాలను ఏపీలో కలిపిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని పురందేశ్వరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Recommended Video

మరోవైపు ప్రధాని మోడీపై టిడిపి మంత్రులు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పట్టుదల, పౌరుషానికి ప్రధాని మోడీ దిగిరావాల్సిందేనని, కడప ఉక్కు సాధించేవరకు చంద్రబాబు వెనక్కి తగ్గబోరని మంత్రి తేల్చి చెప్పారు. మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీలో జగన్ నాటకాలాడుతూ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కాళ్ళ బేరమాడతారని, ఆమరణ దీక్షను వైసీపీ నేతలు హేళన చేయడం సరికాదని హెచ్చరించారు.
మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీతో కలిసి వైసిపి అధినేత జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కడప ఉక్కు దీక్షతో కేంద్రం దిగిరాక తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కడప ఉక్కుదీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, కేసుల కోసం బీజేపీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని జగన్ మర్చిపోయారని హోం మంత్రి చినరాజప్ప ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications