వేధింపు: ఎంపి రాజయ్య ఇంటి ముందు కోడలు నిరసన
వరంగల్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, వరంగల్ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య ఇంటి ముందు ఆయన కోడలు సారిక ఆదివారం ఉదయం నిరసనకు దిగారు. తన భర్త, అత్తమామలు వేధిస్తూ హింసిస్తున్నారని ఆరోపిస్తూ పిల్లలతో వచ్చి, హన్మకొండలో ఆందోళన చేపట్టారు.
తమ బాగోగులను అత్తింటివారెవరూ పట్టించుకోవడం లేదని, కనీస అవసరాలు తీర్చేందుకు కూడా సహకరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో సహా వెళ్లగొట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. రాజయ్య ఎంపీ అయినప్పటి నుండి తనను వేధిస్తున్నారన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు సారిక భర్త సిరిసిల్ల అనిల్ కుమార్, మామ రాజయ్య, అత్త మాధవి, మరో యువతి పైన శనివారం హైదరాబాదులో గృహ హింస కేసు నమోదు అయింది. ప్రస్తుతం సారిక హన్మకొండ రెవెన్యూ కాలనీలో రాజయ్య ఇంటి మొదటి అంతస్తులో ఉంటున్నారు. పోలీసుల పిలుపు మేరకు శనివారం హైదరాబాద్ వెళ్లి, తిరిగి వచ్చేసరికి ఆమె ఉంటున్న మొదటి అంతస్తులో ఇంటికి తాళం వేసి ఉంది.
దీంతో ఆమె కుమారులతో కలిసి ఇంటి ముందు బైఠాయించారు. కామారెడ్డికి చెందిన తనను రాజయ్య అనిల్ ప్రేమించాడని, 2002లో హైదరాబాదులో తమ వివాహం జరిగిందని, ఉద్యోగరీత్యా లండన్ వెళ్లి 2005లో భారత్ వచ్చామని, తమకు ముగ్గురు కుమారులు ఉన్నారని, తన భర్త అనిల్ మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.
ఈ విషయం అత్తమాలకు చెప్పినా పట్టించుకోలేదని, వారు తనను వేధిస్తున్నారన్నారు. రాజయ్య తనకు ఉన్న పలుకుబడితో తనకు ఎక్కడా న్యాయం జరగకుండా చేశారని కన్నీరు కార్చింది. చివరకు కోర్టును ఆశ్రయించడంతో గృహహింస కేసు నమోదు చేశారని చెప్పారు. హైదరాబాద్ వెళ్లి ఇంటికి వచ్చేసరికి తాళం వేశారన్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు.