బీజేపీ విషయంలో పవన్ తప్పులో కాలేశారా ? అనుకున్నది ఒకటైతే అయ్యింది మరొకటా !!
Recommended Video
రాజధాని అమరావతినే శాశ్వత రాజధాని అని నొక్కి వక్కాణించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ను రాజధాని విషయంలో పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన షాక్ కు గురి చేసిందా ? రాజధానిగా అమరావతి ఉండటం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పిన పవన్ ఇప్పుడు కేంద్రం రాజధాని విషయంలో చెప్పిన సమాధానంతో ఏం చెయ్యబోతున్నారు ? కేంద్రంతో మాట్లాడి రాజధాని అమరావతి కోసం తాను చెయ్యగలిగింది చేస్తానని రాజధాని ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ .
అమరావతి కదలదు .. జనసేన నిద్రపోదు .. మీ మీద పడిన దెబ్బలు వైసీపీ వినాశనానికే : పవన్ భావోద్వేగం
రాజధానిపై కేంద్రం స్టాండ్ అర్ధం కాక కష్టాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్
రాజధాని విషయంలో రాష్ట్ర బీజేపీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్టాండ్ తీసుకుంది. కానీ కేంద్రం మాత్రం కర్ర విరగకుండా, పాము చావకుండా రాజధాని విషయాన్ని ప్రస్తావించింది. కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం రాజధానిగా అమరావతి నోటిఫై చేశారు కాబట్టి రాజధానిగా అమరావతినే ఉంటుందా ? లేకా రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోది కాబట్టి మూడు రాజధానులను ఏర్పాటు చేసుకోవచ్చని సంకేతమా ? అన్నది మాత్రం అర్ధం కాకుండా ఉంది. ఇక ఈ నేపధ్యంలో కేంద్రం స్టాండ్ అర్ధం కాక జనసేనాని పవన్ కళ్యాణ్ కు పెద్ద కష్టం వచ్చి పడింది.
రాజధాని కోసమే బీజేపీతో స్నేహం చేశానన్న పవన్ కు షాక్
రాజధాని అమరావతినే, ఇక్కడ నుండి రాజధాని కదలదు అని ప్రజలకు మాటిచ్చిన పవన్ కు కేంద్రం తాజా ప్రకటన రుచించటం లేదు. అమరావతి తరలింపును ఆపగల శక్తి బీజేపీకి ఉందన్న ఉద్దేశం, కేంద్రం తలుచుకుంటే అమరావతి తరలింపు ఆపగలదు అన్న నమ్మకంతో కేంద్రంలోని బీజేపీతో దోస్తీ చేసిన పవన్ కు ఆదిలోనే హంసపాదు అన్న చందంగా కేంద్రం తాజా ప్రకటన కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ వ్యవహారంలో అయినా స్పష్టమైన విధానంతో ఉంటారు. కానీ బీజేపీ రాజధాని అమరావతి కోసం అలా లేకపోవటం పవన్ కు షాక్ అనే చెప్పాలి .
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జీవీఎల్ ల ప్రకటనలతో గందరగోళం
ఇక రాజధాని రైతుల విషయంలో కూడా అయన వారి పక్షానే నిలిచి పోరాటం సాగిస్తానని చెప్పారు. ఆ హామీతోనే తాను పొత్తు పెట్టుకున్నట్లుగా పవన్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు కేంద్రంలోని బీజేపీలా దాగుడుమూతలు ఆడటం రాదు. ఈ నేపధ్యంలోనే రాజధాని అమరావతి కోసం కేంద్రం ఏదైనా చేస్తుందని గంపెడు ఆశలు పెట్టుకుని ఇప్పటికే రాజధాని అమరావతి కోసం పలు మార్లు కేంద్ర పెద్దలతో సంప్రదించిన పవన్ కు అటు కేంద్ర మంత్రి ప్రకటన మాత్రమే కాదు ఆ తర్వాత బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన ప్రకటన కూడా గందరగోళానికి గురి చేస్తుంది.
పవన్ బీజేపీతో కలిసి సాగుతారా అన్న చర్చ
ఈ నేపధ్యంలో ఆయన బీజేపీతో కలిసి సాగుతారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. బీజేపీ విషయంలో పవన్ తప్పులో కాలేశారా ? అనుకున్నది ఒకటైతే అయ్యింది మరొకటా అన్న చర్చ జనసేన పార్టీలో కూడా తాజా పరిణామాల నేపధ్యంలో వ్యక్తం అవుతుంది. రాష్ట్ర బీజేపీ అమరావతి రైతుల పక్షాన పోరాటం చెయ్యాలని, రాజధాని అమరావతి అన్న స్టాండ్ తీసుకున్నా , కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని పరిస్థితులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవటం , రాజధానిగా అమరావతి కొనసాగాలనే స్పష్టమైన ఇండికేషన్ ఇవ్వకపోవటం పవన్ ను పునరాలోచనలో పడేస్తుంది.