నీటి విడుదలకు సైన్ చేయని కెసిఆర్: ఇక జలజగడం
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య ఇక జలవివాదం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా డెల్టా ప్రాంత తాగునీటి అవసరాల కోసం బుధవారం నుంచి 10 టీఎంసీల నీరు విడుదల చేయాలంటూ నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ను, ఒంగోలు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి
విభజన అనంతరం నాగార్జునసాగర్ డ్యాం ఎడమ వైపు భాగం నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ ఆధీనంలో, కుడి వైపు భాగం ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధీనంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జారీ చేసిన జీవో 368 ప్రకారం తెలంగాణ నీటిపారుదల శాఖ, జెన్కో, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ, జెన్కో ఉన్నతాధికారులతో ఏర్పాటైన సంయుక్త కమిటీ కొద్ది రోజుల క్రితం సమావేశమై జూన్ 25 నుంచి కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ నుంచి 10 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించింది.

అయితే, ఈ నిర్ణయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటివరకు ఆమోద ముద్ర వేయలేదు. రెండు టిఎంసీలు ఇస్తే చాలని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వ ఆమోద ముద్ర కోసం సోమవారం వరకు వేచి చూసిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ఇక తాగునీటిని విడుదల చేయాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
"జీవో 368 ప్రకారం కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు నాగార్జున సాగర్ నుంచి సంయుక్త పర్యవేక్షణలో 25వ తేదీ నుంచి నీటిని విడుదల చేయాలి'' అని నాగార్జునసాగర్ సీఈని, ఒంగోలు సీఈని ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఒక వేళ ఈ ఉత్తర్వులను తెలంగాణ వైపున ఉన్న సాగర్ సీఈ పాటించని పక్షంలో తమ పరిధిలో ఉన్న డ్యాం కుడివైపు గేట్ల ద్వారా 10 టిఎంసిల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications