సీఎం జగన్ కు రివర్ బోర్డు జలక్: సీమ ఎత్తిపోతలు ఆపండి : తెలంగాణ ఎఫెక్ట్..వాట్ నెక్స్ట్...!!
ఏపీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుకు కృష్ణా రివర్ బోర్డు స్పందించింది. ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తపోతలను నిర్మిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమయ్యారు. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించిటం లేదని.. తమకు కేటాయించిన నీటినే తాము వాడుకుంటున్నామంటూ వివరణ ఇచ్చారు. గతంలో జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ తమ వాదన వినిపించారు.
ఏపీ వాదన వినిపించుకోవటం లేదా..
కానీ, ఇప్పుడు తాజాగా మరో సారి ఏపీ ప్రాజెక్టుల పైన తెలంగాణ కేబినెట్ లో ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి తీరున పైన అగ్రహం వ్యక్తం అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత తెలంగాణ మంత్రులు శ్రీనివాస గౌడ్, ప్రశాంత్ రెడ్డి, గుంగుల కమలాకర్ వంటి వారు ఈ వ్యవహారం పైన స్పందించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే, ఏపీ ప్రభుత్వం గతంలో వినిపించిన వాదననే మళ్లీ చెప్పుకొచ్చింది. తాము ఎక్కడా కేటాయింపుల కంటే చుక్క నీరు కూడా అదనంగా వాడుకోలేదని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేసారు. తెలంగాణ ప్రభుత్వమే పాలమూరు..డిండి ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తుందంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణ ఫిర్యాదుతో నిర్ణయం..
ఇక, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు కు రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం పైన ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన బోర్డు ఎత్తిపోతల పనులు నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దంటూ ఇచ్చిన ఆదేశాలను రివర్ బోర్డు ప్రస్తావించింది.
పనులు ఆపాలంటూ ఏపీ ప్రభుత్వ ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాసింది. క్షేత్ర స్థాయి పర్యటనకు బోర్డు సభ్యులు వచ్చేందుకు సిద్దమవ్వగా..ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదని లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్ సమర్పించి ఆమోదం పొందే వరకూ పనులు నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా ఇలా ఆదేశాలు ఇవ్వటం పైన ఏపీ అధికారుల్లో చర్చ సాగుతోంది.
సీఎం జగన్ నిర్ణయంపైనే ఆసక్తి..
రాజకీయంగానూ ఇప్పుడు ముఖ్యమంత్రి పైన ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాము పరిమితికి లోబడే నీటిని నిల్వ చేసుకొనేందుకే ఈ ఎత్తిపోతల చేపట్టామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని గతంలోనూ బోర్డుకు నివేదించింది. అయితే, బోర్డు ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల పైన ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుదనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఇదే సమయంలో తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం దీని పైన సుప్రీంలో న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం జల వివాదం.. రివర్ బోర్డు ఆదేశాల పైన ఈ రోజు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ అభ్యంతరాల పైన చర్చించి ..కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది.