గతాన్ని వదిలేసి కలిశాం: రాహుల్ గాంధీ, అందుకే.. అదే మా నినాదం: చంద్రబాబు
హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తు కోసం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం చెప్పారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు తొలుత మాట్లాడారు.
రాజ్యాంగ సంస్థలపై జరిగే దాడిని ఆపడమే తమ ఉమ్మడి లక్ష్యమని చెప్పారు. తమ భవిష్యత్తు కార్యాచరణ ఎప్పటికి అప్పుడు మీడియాకు చెబుతామన్నారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, బీజేపీ స్కాంలపై ఉద్యమిస్తామని అన్నారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. మోడీ నుంచి మీడియాకు ఉన్న కొన్ని ఇబ్బందులు నేను అర్థం చేసుకోగలనని చెప్పారు.
గతాన్ని వదిలేసి భవిష్యత్తు కోసం పని చేస్తాం
గతాన్ని వదిలేసి భవిష్యత్తు కోసం కలిసి పని చేయాలని నిర్ణయించామని రాహుల్ గాంధీ చెప్పారు. పొత్తు విషయంలో మేం గతం గురించి ఆలోచించడం లేదని చెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడమే ప్రథమ కర్తవ్యమని చెప్పారు. మిగిలిన విషయాలు తర్వాత చర్చిస్తామని చెప్పారు. ఫ్రంట్కు ఏ ఒక్కరు నాయకుడు కాదని, అందరం కలిసి పని చేస్తామని అన్నారు.
రాఫెల్ స్కాంలో అవినీతి
రాఫెల్ వ్యవహారంలో అవినీతి జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని రాహుల్ గాంధీ చెప్పారు. రాఫెల్ స్కాం గురించి దేశమంతా తెలుసునని అన్నారు. రాఫెల్ డీల్ పైన విచారణ జరపాల్సిన వ్యవస్థలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. తాము ప్రస్తుత రాజకీయాలపై చర్చించామని చెప్పారు. గతాన్ని వదిలేసి భవిష్యత్తుపై మాట్లాడదలుచుకున్నామని చెప్పారు. చంద్రబాబుతో సమావేశం బాగా జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్ణయించామన్నారు.
దేశాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీని కలిశా
బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటిని ఏకతాటి పైకి తీసుకు వస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే తాను రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. ఇది దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమయం అన్నారు. ఈ దేశాన్ని కాపాడేందుకు ఏకమయ్యామని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని బీజేపీ నాశనం చేస్తోందని చెప్పారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమవుతామన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఒక సమావేశాన్ని పెట్టుకొని భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పైన బాధ్యత
త్వరలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొంటుందని చంద్రబాబు చెప్పారు. దేశ ప్రయోజనాలు కాపాడటం అనేది ఉమ్మడి లక్ష్యమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పైన కీలక బాధ్యత ఉందని చెప్పారు. దేశాన్ని కాపాడుదాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఆర్బీఐ సహా వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టించిందన్నారు. న్యాయవ్యవస్థలను కూడా కేంద్ర ప్రభుత్వం విడిచి పెట్టడం లేదన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడటం ఉమ్మడి లక్ష్యమని చెప్పారు.