తెలంగాణ లక్ష ఇస్తే మేం లక్షన్నర ఇచ్చాం, వెనక్కిచ్చి మాట్లాడండి: బాబు కోపం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం నాడు రుణమాఫీ అంశంపై కోపం వచ్చింది. రుణమాఫీ పైన విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు మహానాడు వేదికగా ఆ అంశంపై మాట్లాడారు.
టీడీపీ కార్యకర్తలు, నాయకులు, నేతలు సంక్షేమ పథకాల విషయంలో ఎవరికీ సంజయిషీ ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. పథకాలను పూర్తిగా అమలు చేస్తున్నామని, కార్యకర్తలు దూకుడుగా వెళ్లవచ్చునని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణ రూ.లక్ష మాత్రమే రుణమాఫీ చేసిందని, కానీ అప్పుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.లక్షన్నర వరకు చేసిందన్నారు. రుణమాఫీ పైన విమర్శలు చేసే వారిని లబ్ధి పొందిన రూ.లక్షన్నర చెల్లించాక మాట్లాడమనండని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను మనం నిజం చేయాలని, అందరూ కష్టపడితే మనల్ని నమ్ముకున్న ప్రజలకు సంతోషం కలుగుతుందని చంద్రబాబు అన్నారు. నేను ఇంకా ఎక్కువ కష్టపడతానన్నారు.
ఈ సంవత్సర కాలంలో దొంగల గుండెల్లో నిద్రపోయామని, పేదప్రజలకు అండగా ఉన్నామన్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎర్రదొంగల బారినుంచి ఎర్రచందనాన్ని కాపాడి వాటిని విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి 3000 కోట్ల రూపాయల పైబడి ఆదాయం తీసుకు వచ్చామన్నారు.
తాను కోరుకునేది ఒక్కటే నని, అది, మనల్ని నమ్ముకున్న ప్రజలు బాగుండాలన్నారు. ప్రజలు మనతోనే ఉన్నారంటూ ప్రజల విశ్వాసాన్ని మనం ఎన్నటికీ కోల్పోకూడదంటే మరింత బాగా పని చేయాలని పిలుపు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఉన్నాయని, ఒకటి రాష్ర్టానికి ద్రోహం చేసిన పార్టీ అయితే మరొకటి అవినీతి పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలకూ ప్రజలలో విశ్వసనీయత లేదన్నారు. అందువల్లే మరింత బాధ్యతతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తపలకు అవకాశం లేకుండా పని చేయాలన్నారు.