మమ్మల్ని మేం రక్షించుకోవాలి!: సోనియాతో కలిసి సాగుతారా అంటే చంద్రబాబు ఏం చెప్పారంటే?
బెంగళూరు/హైదరాబాద్: జేడీఎస్ అధినేత కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ వేడుకకు ప్రాంతీయ పార్టీల నాయకులు తరలి వస్తున్నారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బెంగళూరు చేరుకున్నారు. ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
Recommended Video
ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చంద్రబాబు బెంగళూరులో మీడియాతో అన్నారు. కాంగ్రెస్ - జేడీఎస్ కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కావడం తమకు సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోను తాము (ప్రాంతీయ పార్టీలు) కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.
సీఎంగా కుమారస్వామి ప్రమాణం, ఒకే వేదికపై సోనియా-చంద్రబాబు: బీజేపీ నిరసన దినం
మమ్మల్ని మేం రక్షించుకోవడం కోసం కలిసి పని చేస్తాం
నేను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశానని చంద్రబాబు చెప్పారు. రీజినల్ పార్టీకి చెందిన కుమారస్వామి సీఎం కావడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మమ్మల్ని మేం రక్షించుకోవడానికి అలాగే, నేషనల్ ఇంటరెస్ట్ అజెండాగా పని చేస్తామని చెప్పారు.
నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ గురించి ప్రశ్నించగా
మమతా బెనర్జీతో మోడీకి వ్యతిరేక ప్రంట్ గురించి మాట్లాడారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ప్రాంతీయ పార్టీలు అన్నీ ఇక్కడ ఉన్నాయని, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఇది చాలా ముఖ్యమైన అంశమని చంద్రబాబు చెప్పారు. టీడీపీ సోనియా, రాహుల్ గాంధీతో కలిసి వెళ్తుందా అని అడగ్గా.. ప్రాంతీయ పార్టీ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చామని చెప్పారు. మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఉంటుందా అని అడగ్గా.. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు.
ముందు ముందు కలిసి సాగుతాం
కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయినందుకు తాము కర్ణాటక సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని మమతా బెనర్జీ అన్నారు. భవిష్యత్తులో తాము కలిసి ముందుకు సాగుతామని, జాతీయ భావనతో వెళ్తామన్నారు. దేశంలోన్ని అన్ని ప్రాంతీయ పార్టీలు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నాయని తెలిపారు.
ఏకమవుతున్న ప్రాంతీయ పార్టీలు
కాగా, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, లెఫ్ట్ పార్టీ నేత సీతారాం ఏచూరీ, శరద్ పవార్ తదితరులు బెంగళూరు చేరుకున్నారు. మొత్తానికి హెచ్ డీ కుమారస్వామి సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమవుతున్నాయి.