దొంగబాబులా చానెల్, పత్రిక పెట్టాలని లేదు, ఫ్యాన్ మసైంది: జగన్పై నారా లోకేష్
విశాఖపట్నం: దొంగబాబులా తాము చానెల్, పత్రిక పెట్టాలని అనుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వాళ్లు ఏమీ చేయలేరని ఆయన అన్నారు.
తమ పార్టీ హవాతో ఫ్యాన్ మాడి మసై పోయిందని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. విశాఖపట్నం జిల్లా చీడికాడలో సోమవారం జరిగిన జనచైతన్య యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
106 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో అదే విధంగా మాడుగులను కూడా దత్తత తీసుకుని పద్ధతి ప్రకారం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఇక్కడి నియోజకవర్గం కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, నియోజకవర్గం నేతల మధ్య విభేదాలు త్వరలోనే సమసిపోతాయని ఆయన ్ననారు.
తాను నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తానని, నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్లాలని సూచించారు. కలిసికట్టుగా అందరం ముందుకు సాగుదామని సూసించారు.