ఎల్లో మీడియా ప్రచారం, జగన్ వెంటే: ఎమ్మెల్యేలు, గీతకు క్లీన్చిట్!
హైదరాబాద్: రాజకీయాల్లో ఉన్నంత వరకు తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ వెంటే ఉంటామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్పష్టం చేశారు.
శనివారం పొదలకూరు మండల కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కాకాణి విలేకరులతో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికల సమయం నుంచి కొందరు పనిగట్టుకుని తాను టీడీపీలో చేరతానని దుష్ర్పచారం సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలు రాసే ముందు సంబంధిత ఎమ్మెల్యేల వివరణ సేకరించాల్సిన బాధ్యత పత్రికలు, టీవీ ఛానళ్లపై ఉందన్నారు. ఆలాగే ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గూడూరులో విలేకరులతో మాట్లాడారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు.

కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల్లో విలువలు కోల్పోతున్న పార్టీలో తాను చేరుతున్నట్లు ఎల్లో మీడియా పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. వైసీపీ నుంచి మారే ప్రసక్తే లేదని, రాజకీయాల్లో ఉన్నంత కాలం పార్టీ అధినేత జగన్ వెంటే ఉంటానని ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు. కాగా, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ఎంపీ కొత్తపల్లి గీతకు ఈసీ క్లీన్ చిట్!
అరకు పార్లమెంటు సభ్యురాలు, వైయస్సార్ కాంగ్రెస్ అసంతృప్త నేత కొత్తపల్లి గీతకు ఈసీ ఆదివారం క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ పత్రాలు ధాఖలు చేసి, కొత్తపల్లి గీత ఎన్నికల్లో పోటీచేశారని ఎలక్షన్ కమిషన్కు వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదుపై విచారించిన ఈసీ, ఆ ఫిర్యాదులో నిజం లేదని తేల్చిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications