'పవర్'లోకి వస్తే ఎవర్నీ వదిలేది లేదు.. భూదందాకు లీడర్ లోకేషే: విజయసాయి రెడ్డి
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఈ దందాలో ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ కబ్జా వ్యవహారంపై దర్యాప్తు జరిపించి దోచుకున్న సొమ్మంతా పేదలకు పంపిణీ చేసేలా చూస్తామని అన్నారు.
విశాఖపట్నం: విశాఖపట్నం భూదందాపై రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కై సామాన్యుల భూములను కబ్జా పెడుతున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల హస్తమున్నందువల్లే ఈ విషయంలో ప్రభుత్వం ఏమి చేయలేకపోతోందని వారు ఆరోపిస్తున్నారు.
తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ భూదందాపై స్పందించారు. ఒక్క విశాఖపట్నంలోనే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. భూదందా వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల హస్తం ఉందని, ఈ ముఠాకు లోకేష్ లీడర్ గా ఉన్నారని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఈ దందాలో ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ కబ్జా వ్యవహారంపై దర్యాప్తు జరిపించి దోచుకున్న సొమ్మంతా పేదలకు పంపిణీ చేసేలా చూస్తామని అన్నారు. కాగా, శనివారం నాడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా ఇదే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ ఆధ్వర్యంలోనే విశాఖ భూదందా నడుస్తుందంటూ ఆయన ఆరోపించారు.