చిరంజీవి వారించారు, మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చా, లోకేష్ లేరు సంతోషం: పవన్
రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి నా కులం, నా మతం అని ఓటు వేస్తూ పోతే ఈ వ్యవస్థ బాగుపడదని, ఇంకెంతకాలం కులాలు చూసి ఓటు వేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన డాక్టర్లతో, జనసైనికులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు చిన్నప్పుడు ఆస్తమా ఉండేదని, 19 ఏళ్ల వయస్సు వరకు ఉండేదని, ఆ సమయంలో డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడి రోగులను చూసి బాధపడేవాడినని చెప్పారు.
Recommended Video
ఏపీ ఎఫెక్ట్-చంద్రబాబు ప్లాన్: తెలంగాణలో ఎక్కువ సీట్లు ఎందుకు డిమాండ్ చేయట్లేదు?
చికిత్స కంటే నివారించడం ముఖ్యమనే విషయాన్ని తాను నమ్ముతానని చెప్పారు. ఎంతసేపు వ్యక్తిగత లాభం చూసుకొని పని చేస్తే ప్రజలకు వైద్య సదుపాయం ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఐదు సంవత్సరాలు కష్టపడి డాక్టర్ అయితే కనీసం పంచాయతీ సర్పంచ్గా కూడా పోటీ చేయని వ్యక్తి మంత్రి అయి మనలని పరిపాలించే దైర్భాగ్యంలో రాష్ట్రం ఉందో తెలుస్తోందన్నారు.
చిరంజీవి వారించడంతో సినిమాల్లోకి వచ్చా
తాను సమాజంలోని సమస్యలను చూసి విఫల భావాలతో తుపాకి పడదామని అనుకున్నానని, తన అన్నయ్య చిరంజీవి వారించడంతో సినిమాల్లోకి వచ్చానని, కనీసం సినిమాల్లో మార్పు కోసం నాలుగు మాటలు చెప్పేవాడినని పవన్ అన్నారు. కానీ సినిమాల్లో సమస్యలు పరిష్కరించడంలో సంతోషం కలిగించలేదని, అందుకే వైద్యం సహా అన్ని సమస్యలపై పోరాడేందుకు వచ్చానని చెప్పారు.
లోకేష్ లేకపోవడం సంతోషం
అక్రమ మైనింగ్ పైన, డెంగ్యూ జ్వరాల పైన చర్చ పెట్టవచ్చు కదా అని పవన్ అన్నారు. కోపం వచ్చి ఎవడైనా ఒక మాట అంటే దాని మీద చర్చలు పెట్టే టీవీ ఛానల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఎందుకు పెట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ప్రజా సంపదను ప్రజలకు ఇస్తూ చంద్రబాబు తుఫాన్ సహాయం ఫోటోలో నవ్వడం ఏమిటని, అది బాధపడాల్సిన అంశమని, సంతోషం ఏమంటే అందులో లోకేష్ ఫోటో లేదని ఎద్దేవా చేశారు.
ఓటు వేయకుంటే ప్రశ్నించే హక్కు లేదు
2014లో చంద్రబాబుకు నేను అండగా నిలబడ్డానని, ఈ రోజు మీ సమస్యలు చెప్పుకోవడానికి కనీసం మీకు ఆరోగ్య శాఖకు మంత్రి కూడా లేరని పవన్ అన్నారు. మీరు ఓటు వేయండి.. (ఓటు హక్కు వినియోగించుకోవడం) ఓటు వేయకుంటే మీకు ప్రశ్నించే హక్కు ఉండదని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో అందరం ఓటేద్దామని పిలుపునిచ్చారు.
రెల్లి కులంలో పుట్టాలనుకుంటా
విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని పవన్ అన్నారు. ప్రభుత్వం అండగా నిలవకుంటే ఎవరైనా పన్ను కట్టాలని ఎందుకు అనుకుంటారని చెప్పారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లను కస్టర్లుగా మార్చాలన్నారు. రాష్ట్ర బాధ్యత తీసుకునేసినిమాల నుంచి రాజకీయాలకు వచ్చానని చెప్పారు. జనసేన ప్రజాస్వామ్యం బాధ్యత తీసుకుంటుందన్నారు. వైద్య సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి కూడా లేరన్నారు. మీరు ఓటు వేసినా వేయకున్నా అందరి బాధ్యత జనసేన తీసుకుంటుందని చెప్పారు. ఓటుహక్కు వినియోగించుకుంటేనే మీకు నిలదీసే హక్కు ఉంటుందన్నారు. అంతకుముందు, పారిశుద్ధ్య కార్మికులతో జనసేనాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను రెల్లి కులంలో పుట్టాలని కోరుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రెల్లి కులస్తుల సమస్యలు విని చలించిపోయానని చెప్పారు. ఈ రోజుల్లో కూడా మానవ మలమూత్రాలను చేతితో శుభ్రం చేయడం అత్యంత దారుణం అన్నారు. రెల్లి కులస్తులకు న్యాయం జరిగేందుకు ఓ సోదరుడిగా అండగా ఉంటానని చెప్పారు.
మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చా
నేను మీలో ఒకడినని, మీ అన్నను, తమ్ముడినని, మీరు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, మనం 25 సంవత్సరాల సుదీర్ఘమైన మార్పు కోసం వచ్చామని జన సైనికులతో పవన్ చెప్పారు. తనను సంవత్సరం పాటు తిట్టినా కోపం రాదని, ఒక గిరిజనుడిని, పారిశుద్ధ్య కార్మికుడికి ఏదైనా జరిగితే మాత్రం సహించనని చెప్పారు. నేను మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చానని, మీరు అండగా ఉండబట్టే నిన్న జగ్గంపేటలో సభ విజయవంతమైందని చెప్పారు. నాకు మీకు మధ్య రెండు గుండెలు మాత్రమేనని పవన్ చెప్పారు.