సబ్బం, మరో ఎంపి విషం మింగుతుంటే ఆపాం: పొన్నం
హైదరాబాద్: సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, మరో ఎంపి విషం మింగుతుంటే తాము ఆపామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాక్షసుడిలా వ్యవహరించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తాము ఆత్మరక్షణ కోసం ప్రయత్నించామని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అబద్ధాలు ఆడుతున్నారని, ఫుటేజీలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని ఆయన అన్నారు. లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణపై దాడి జరిగినప్పుడు బ్లాక్డే అన్నవాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. అల్లరి చేసింది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులేనని ఆయన అన్నారు.
తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష్మణరేఖ దాటిన ముఖ్యమంత్రిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించడం క్రమశిక్షణా రాహిత్యమేనని ఆయన అన్నారు. తెలంగాణ కన్నా 16 చిన్న రాష్ట్రాలున్నాయని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభావంతో తెలంగాణపై బిజెపి మాట మారుస్తోందని ఆయన అన్నారు.
చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి
తెలంగాణపై బిజెపి ద్వంద్వ వైఖరి విడనాడాలని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బలరాం నాయక్ కోరారు. తెలంగాణకు మద్దతు ఇస్తామని ఇచ్చిన మాటను బిజెపి నిలబెట్టుకోవాలని ఆయన శనివారం మీడియాతో అన్నారు. తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. తెలంగాణపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డిఎ పాలనలో తెలంగాణను చంద్రబాబు అడ్దుకోవడం వల్లనే సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. భద్రాచలాన్ని సీమాంధ్రులు అడగవద్దని, తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.