హైదరాబాద్లో పనిచేయలేం: బాబు, ఏపి గర్వపడేలా..
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి పనులు చేయలేకపోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కొందరు ఏపికి రాజధాని లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాలను, ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
రాజధాని నిర్మాణంలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం కోసం, హుధుద్ తుఫాను బాధితుల కోసం అనేకమంది ప్రజలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని చెప్పారు. ఒక్క ఇటుకతో సమానమైన విలువ గల సాయం అందించాలని ప్రతీ ఒక్కర్ని కోరుతున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే రాజధాని నిర్మాణమవుతుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 4.95కోట్ల జనాభా ఉందని చెప్పారు.
రాజధాని కోసం స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. విభజన సమయంలో ఆస్తులు, అప్పుల విషయంలో అన్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరి శ్రమ, విరాళం ఉండాలని చెప్పారు. కొందరు ఏపికి రాజధాని లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు తన మీద, తనకు ప్రజల మీద నమ్మకముందని చంద్రబాబు చెప్పారు.
రాజధాని కోసం భూమి ఎంత కావాలనేది భవిష్యత్ నిర్ణయిస్తుందని తెలిపారు. రాజధాని అభివృద్ధితో ముందుగా స్థానికులకే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పేదలకు ఉపాధి చూపిస్తామని అన్నారు. రైతులకు రాజధాని విషయంలో అపోహలొద్దని, డబ్బులు సంపాదించుకునే మార్గం చూపిస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణంతో ప్రముఖ కంపెనీలు ఇక్కడకు వస్తాయని చెప్పారు. అందరూ అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాజధాని వల్ల 10వేల కుటుంబాలు లాభపడతాయయని చంద్రబాబు చెప్పారు. బోనపాడు,ఆటోనగర్, ప్రకాశం బ్యారేజి, బోరుపాలెం ప్రాంతాల సరిహద్దులో రాజధాని రూపుదిద్దుకుంటుందని తెలిపారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలతోపాటు 14 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, రాజధానితో వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు.
తెలుగుజాతి గర్వపడేలా ఉండాలనే ఇక్కడ రాజధాని నిర్మిస్తున్నామని తెలిపారు. రాజధానితో ఈ ప్రాంతానికి గుర్తింపు వస్తుందని తెలిపారు. రైతులు, బడుగు, బలహీన వర్గాలకు రాజధాని వల్ల లాభం చేకూరుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రజలు లేని చోట రాజధాని కడితే అభివృద్ధి ఉండదని అన్నారు. ఢిల్లీ, ఛండీగఢ్ లాంటి ఆధునిక రాజధానిని నిర్మిస్తామని చెప్పారు.
రాజధాని నిర్మాణం కోసం అందరూ సహకరించాలని చంద్రబాబు కోరారు. బ్రాడ్ పాలసీ రెడీగా ఉందని, అందరి ఆమోదంతో నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం సాధారణంగానే భూసేకరణ చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆదాయాలను పెంచే మార్గం చూస్తున్నామని చెప్పారు. రైతులను, కూలీలను, పేదలను అన్ని విధాల ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం మనకు అవకాశం వచ్చిందని తెలిపారు.