బిజెపికి చాలా మంది ఉన్నరు, మాకే వేయండి: కెసిఆర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితినే గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ పునర్మిర్మానం టిఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీతోపాటు వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు టిఆర్ఎస్లో చేరారు. మాజీ డిజిపి జయచంద్రతోపాటు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు కూడా కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రాంతంలోని ఎక్కువ మంది ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటువేసి.. పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చూస్తున్నారని అన్నారు. బిజెపికి ఓటు వేసేందుకు దేశంలో చాలా మంది ఉన్నారని, తెలంగాణ ప్రజలు మాత్రం టిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలంటే తెలంగాణ ప్రాంతంలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలతోపాటు పార్లమెంటు స్థానాలను కూడా గెల్చుకోవాలని అన్నారు.

తెలంగాణలోని ప్రజల బాధలు తమకే ఎక్కువగా తెలుసని కెసిఆర్ అన్నారు. 14ఏళ్లుగా జరుగుతున్న ఉద్యమంలో మారుమూల ప్రాంతాలను తాము సందర్శించామని, ప్రజలు, రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తమకే తెలుసునని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ రాకముందు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి అవమానకర పరిస్థితి ఉండేదని చెప్పారు. తాము వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు గౌరవం వచ్చిందని తెలిపారు.
తెలంగాణలో 85శాతం బడుగు బలహీన వర్గాలకు చెందిన బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీలున్నారని కెసిఆర్ తెలిపారు. పేద బతుకులు మారాలి, వారి కళ్లల్లో కాంతులు చూడాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఒక్క గది కట్టించి కుటుంబ మొత్తాన్ని ఉండమని చెప్పాయని ఆరోపించారు. అలాంటి మంత్రులెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన రూ. 2.75లక్షలతో పేదలకు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు.
ప్రతీ ఇంటిని 125 గజాల జాగాలో కడతామని, అందులో రెండు పడక గదులు, వంటగది, హాల్ ఉంటాయని చెప్పారు. బాత్రూం, పాయకానాలు కూడా ప్రభుత్వమే కట్టిస్తుందని తెలిపారు. ఇవన్నటీ అమలు చేసే బాధ్యత తనదేనని కెసిఆర్ చెప్పారు.తెలంగాణలోని పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో కులాల పేరుతో హాస్టళ్లు ఉండవని, అందరికీ ఒకే ప్రభుత్వ హాస్టళ్లు ఉంటాయని తెలిపారు. 15 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాలలను నిర్మించాలనేది తన కల అని చెప్పారు. మండలానికి 4,5 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తామని తెలిపారు.
పాఠశాలలను జిల్లా కలెక్టర్లు, మంత్రులు తరచూ తనఖీలు చేస్తారని చెప్పారు. పాఠశాలల్లో సిబిఎస్ఈ విద్యనందిస్తామని తెలిపారు. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని కెసిఆర్ తెలిపారు. భద్రాచలంలోని ఏడు మండలాలు తెలంగాణలో ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కొత్త నాయకత్వం అవసరమని చెప్పిన కెసిఆర్, టిఆర్ఎస్కు గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసి చూపిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications