సిఎం చంద్రబాబుపై కోర్టు ధిక్కార పిటిషన్...అసెంబ్లీలో హక్కుల తీర్మానం;ఇక్కట్లు తప్పవు:బిజెపి
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ముంబై హైకోర్టులో పిల్ వేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కన్నా మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం న్యాయవ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తమ అవినీతిని, అసమర్ధతను కప్పిపుచ్చుకొనేందుకే ప్రధాని మోడీపై సిఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎపి సిఎంచంద్రబాబుపై ఎపి అసెంబ్లీలో సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బిజెపి ఎంపి జివిఎల్ వెల్లడించారు.
మరోవైపు బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు విజయవాడలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహారాష్ట్ర న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నామని పునరుద్ఘాటించారు. కోర్టులపై చంద్రబాబు, టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను న్యాయ నిపుణులకు చూపించడం జరిగిందని చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ పిటిషన్ ను రెడీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బాబ్లీ ప్రాజెక్ట్ కేసు విషయంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారని ఎంపి జివిఎల్ ఆరోపించారు.
అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా సీఎం చంద్రబాబుపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఎంపి జీవీఎల్ వెల్లడించారు. శాసన సభలో కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఎంపి జివిఎల్ వెల్లడించారు. ఇటు హక్కుల తీర్మానం అటు కోర్టు ధిక్కార పిటిషన్తో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవన్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్నీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జివిఎల్ మండిపడ్డారు. ఏపీకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పడం దారుణమన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్నా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని జివిఎల్ దుయ్యబట్టారు.
వైజాగ్- చెన్నై కారిడార్కు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం దారుణమని...ఈ కారిడార్ కు అయ్యే ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుందని వెల్లడించారు. వాస్తవానికి ఏపీకి ఏ రాష్ట్రానికి ఇవ్వని వెసులుబాటులు కల్పించామని ఎంపి జివిఎల్ చెప్పుకొచ్చారు. పెట్రోలియం ప్రాజెక్టుతో ఏపీకి పెట్టుబడులు వచ్చేందుకు కేంద్ర సహకారం ఎంతో ఉందన్నారు. ప్రజలకు ఏ పార్టీపై లేనంత ఆగ్రహం టీడీపీపై ఉందని...ఈ మధ్యే ప్రకటించిన ఓ సర్వేలో ఇదే విషయం స్పష్టమయ్యిందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జివిఎల్ జోస్యం చెప్పారు.
Recommended Video