తెలంగాణలో పార్టీ ఖాళీ కాదు, గెలుపు మాదే: బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ ఖాళీ కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంత టిడిపి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి తెలంగాణ ప్రాంతం ఎల్లప్పుడూ అండగానే ఉందని అన్నారు. తమ పార్టీ ఖాళీ అవుతుందన్న వారి పార్టీయే ఖాళీ అవుతుందని చెప్పారు.
తెలంగాణ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకుంటుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వార్థంతో కొందరు నాయాకులు పార్టీని వీడి వెళ్లిపోయారని, అయితే పార్టీకి చెందిన కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారని చెప్పారు. వారి రుణం తీర్చుకోలేనని చంద్రబాబు తెలిపారు.
తమ పార్టీ ప్రభుత్వ హయాంలోని తెలంగాణతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకే గాక దేశానికి కూడా తమ పార్టీ సేవలు అవసరమని అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలకు టిడిపి రాజకీయంగా చేయూతనిచ్చిందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో టిడిపి ఎప్పుడూ వెనక్కిపోలేదని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అభివృద్ధితోపాటు సైబరాబాద్ ఏర్పాటుకు కృషి చేశామని తెలిపారు.
1994లో జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించానని చంద్రబాబు తెలిపారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో గెలిచే పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పార్టీ పాలుపంచుకుంటుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రజలు సీమాంధ్రులకు వ్యతిరేకం కాదని చంద్రబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.