విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ సంస్థలు కూడా ప్రైవేటీకరిస్తాం .. మరోమారు బాంబు పేల్చిన కేంద్రం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరోమారు స్పష్టత ఇచ్చింది. ఎన్నిసార్లు ఎవరడిగినా ఒకటే సమాధానం అని కేంద్రం తేల్చిచెప్పింది. పార్లమెంట్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జవాబిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడంపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతంగా మారుతున్నప్పటికీ కేంద్ర మాత్రం తన వైఖరి మార్చుకోబోమని తేల్చిచెప్పింది.

స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ సంస్థలు కూడా కలిపి ప్రైవేటీకరణ చేస్తాం : ఉక్కు మంత్రి
100% విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ సంస్థలు కూడా కలిపి ప్రైవేటీకరణ చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ మరోమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బాంబు పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేల్చి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒడిసా, చత్తీస్ గడ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఇనుప ఖనిజ గనులను కేటాయించాల్సిందిగా కోరిందని, ఉక్కు మంత్రిత్వ శాఖను కూడా విజ్ఞప్తి చేసిందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు .

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేది లేదన్న కేంద్రం
ఒడిశా ప్రభుత్వాన్ని ఒక ఇనుప ఖనిజం ప్రత్యేక బ్లాక్ కేటాయించాలని కేంద్ర ఉక్కు శాఖ కూడా విజ్ఞప్తి చేసిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నవరత్న సంస్థగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ వాణిజ్య ,ఆర్థిక లావాదేవీలను చేస్తోందని చెబుతూనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోయిందని, ఆగేది లేదని మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టారు .

ఆందోళనలు ఉధృతం అవుతున్నా వెనక్కు తగ్గని కేంద్రం
కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కార్మిక సంఘాలు ,ఉద్యోగులు, అఖిలపక్ష పార్టీల నాయకులు పోరు బాట పట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం చేస్తున్నారు. కేంద్రం ప్రైవేటీకరించడం అనుకున్న మిగతా సంస్థలకు భిన్నంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చూడాల్సిన అవసరం ఉందని, ఎంతోమంది ప్రాణ త్యాగాల కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయిందని వారంటున్నారు. ఎవరు ఏం చెప్పినా, ఎంతగా ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని తేల్చి చెప్తుంది.












Click it and Unblock the Notifications