వారసత్వం, సుల్తాన్బజార్పై ఆంధ్రుల కుట్ర: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన సమక్షంలో కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలకు చెందిన డాక్టర్ సంజయ్తోపాటు పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. సీమాంధ్రలోని అక్రమ నీటి ప్రాజెక్టులన్నీ పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్న సమయంలోనే పూర్తయ్యాయని ఆరోపించారు.
పొన్నాల లక్ష్మయ్య నిర్వాకం వల్ల తెలంగాణ ప్రాంతంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని కెసిఆర్ అన్నారు. సీమాంధ్రకు చెందిన రఘువీరారెడ్డి మంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతం నుంచి నీరు తరలించుకుపోతుంటే తెలంగాణ మంత్రిగా ఉన్న డికె అరుణ మంగళ హారతి పట్టారని కెసిఆర్ ఆరోపించారు. ఇలాంటి కాంగ్రెస్ నాయకులేనా తెలంగాణను కాపాడేదని ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలని అన్నారు.

ఆంధ్రా పాలకులు తెలంగాణ పత్రికలు లేకుండా చేశారని, తెలంగాణ వారసత్వ సంపదను కూడా నాశనం చేసేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు ద్వారా కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణ వారసత్వ సంపద అయిన సుల్తాన్బజార్, అసెంబ్లీ, మొజాంజాహీ మార్కెట్, గన్పార్క్లోని అమరవీరుల స్థూపాన్ని కాపాడుకునేందుకు తాను మెట్రో అధికారులతో మాట్లాడానని తెలిపారు. వాటికి ఎలాంటి హాని కలిగించబోమని మెట్రో అధికారులు తనకు చెప్పారని కెసిఆర్ తెలిపారు. ఇందుకు ఏమైనా ఎక్కువ ఖర్చు అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లిస్తామని వారికి చెప్పినట్లు కెసిఆర్ తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. యువకుడైన డాక్టర్ సంజయ్ను గెలిపించాలని జగిత్యాల ప్రజలకు కెసిఆర్ పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగిత్యాలను జిల్లాగా ప్రకటిస్తామని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన అని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, బాషను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని తెలిపారు.
తాను కరీంనగర్ ఎంపిగా ఉన్నప్పుడు ఇంజినీర్ నారాయణరెడ్డితో నీటి రీ జనరేషన్పై సర్వే చేయించినట్లు తెలిపారు. నీటి రీ జనరేషన్ వల్ల రైతుల పంటలకు అదనంగా నీరు లభిస్తుందని చెప్పారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లంబాడ తాండాలను పంచాయతీలుగా చేస్తామని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని కెసిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications