పూర్వ వైభవం తెస్తాం: చంద్రబాబు, దీపాలు వెలించాలని
విశాఖపట్నం: విశాఖ నగరానికి పూర్వ వైభవం తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గతం కంటే సుందరంగా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖ పునర్నిర్మాణానికి ప్రతీ పౌరుడు ముందుకు రావాలని కోరారు. విశాఖ అభివృద్ధికి సామాజిక మీడియాను కూడా ఉపయోగిస్తామని చెప్పారు. విశాఖ అభివృద్ధిని చూసి.. ఎందుకొచ్చానా అని హుధుద్ తుఫాను బాధపడే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
హుధుద్ తుఫానును ధైర్యంగా ఎదుక్కొన్న విశాఖ ప్రజలకు అభినందనలు తెలిపారు. బాధితులకు సాయం చేసేందుకు ప్రముఖులు, కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ముందుకు వచ్చిన కంపెనీల సాయం కోరామని, ఇన్ఫోసిస్ని రూ. 5 కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. గ్రామాలను దత్తత తీసుకోవాలని పలు కంపెనీలను కోరినట్లు తెలిపారు.
నగరంలో 70శాతం విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇంకా పలుచోట్ల కూలిన చెట్లను తొలగించాల్సి ఉందన్నారు. ప్రజల కళ్లల్లో ఆనందం చూడాలి.. దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఈసారి దీపావళి రోజు బాణాసంచా కాల్చొద్దని.. దీపాలు వెలిగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. బాణాసంచా పేల్చడం వల్ల ఎండిపోయిన చెట్లకు అంటుకుని ప్రమాదాలు జరిగే అవకాశముందని అన్నారు.
శుక్రవారం రాత్రి 12.30గంటల సమయంలో నగరంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్పై ఎక్కడా ఫిర్యాదులు లేవన్నారు. ఏపిఎన్జీవోలు రెండు రోజుల వేతనం రూ. 125 కోట్లను బాధితుల సాయం కోసం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబును సిఎం చంద్రబాబు అభినందించారు. ఆదివారం సాయంత్రం వరకు విశాఖలోనే ఉంటానని చంద్రబాబు చెప్పారు. దీపావళి ముందు, తర్వాత కూడా విశాఖకు మళ్లీ వస్తానని తెలిపారు. ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉందని చెప్పారు.
ఉద్యోగస్తులందరూ సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వారిని అభినందించారు. ఏపిని బెస్ట్ స్టేట్గా చేస్తామని చంద్రబాబు చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో కూడా ఉద్యోగస్తులు పాల్గొంటారని అశోక్ బాబు ఈ సందర్భంగా చెప్పారు. ప్రతీ ఉద్యోగి ఒక్కో మొక్కను నాటాలని ఆయన అన్నారు. చంద్రబాబు చేపట్టిన సహాయక చర్యలు గర్వపడేలా ఉన్నాయని అశోక్ బాబు అన్నారు.