మోడీ! ఎందుకిలా?, వైసీపీ కుట్ర, పవన్పై నిఘా, బీజేపీ ఓడిపోయిందని..: బాబు ఆవేదన
Recommended Video

అమరావతి: ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనో భావాలకు విరుద్దంగా నడుచుకుంటే ఫలితాలు ఈ విధంగానే ఉంటాయన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఉండవల్లిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి టీడీపీ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేస్తే ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినందున అలా చేశారంటారని, తొందరపాటు నిర్ణయాలు తగదని అన్నారు. అంతేగాక, ఒక వ్యూహం ప్రకారం నడుచుకోవాలని స్పష్టంచేశారు.

బీజేపీతో తగిన సమయంలో..
ప్రస్తుతానికి ఎన్డీయేలో కొనసాగుతూనే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల సాధనకు అన్ని మార్గాల్లో ఒత్తిడి తీసుకువద్దామన్నారు. ఇకపై కేంద్రాన్ని మెతగ్గా అడగడం ఉండదని, పోరాటం ద్వారానే అన్నీ సాధించుకుంటామని తెలిపారు. బీజేపీతో పొత్తు కొనసాగించడంపై తగిన సమయంలో రాజకీయ నిర్ణయం తీసుకుందామని చెప్పారు. మంత్రి అచ్చెనాయుడు ఎన్డీయే నుంచి బయటకు రావాలని సూచించిన నేపథ్యంలో చంద్రబాబు ఈ విధంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని బట్టి మన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుందామని చెప్పారు.

మోడీ నాతో మాట్లాడారు కానీ..
‘కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాలని మనం నిర్ణయించిన మర్నాడు ప్రధాని నాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా ఎన్డీయేలో ఉంటామని, రాష్ట్రానికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాను. అప్పుడు కూడా ఆయన అన్ని అంశాలూ పరిష్కరిస్తామన్న హామీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా వారి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాల్లేవు' అని చంద్రబాబు నేతలకు వివరించారు.

అప్పుడేమో గానీ.. ఇప్పుడైతే మోడీకి సహకరిస్తూనే ఉన్నా..
ప్రధానితో తనకు ఎలాంటి విభేదాల్లేవని, ఎందుకో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘నేను, ఆయన ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అప్పటి పరిస్థితుల్ని బట్టి ఏమున్నా ఇప్పుడవి అప్రస్తుతం. ఈ నాలుగేళ్లలో నేను కేంద్రానికి పూర్తి స్థాయిలో సహకరించాను. అయినా ఎందుకోగానీ ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై గురు, శుక్రవారాల్లో కూడా విస్తృతంగా మాట్లాడతాను. మీరూ మాట్లాడండి. కేంద్రంపై మనం చేస్తున్న పోరాటాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడంలో మీ చొరవే చాలా ముఖ్యం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు ఆవేదన
బీజేపీతో పొత్తు వల్ల అటు తెలంగాణలోను.... ఇటు ఆంధ్రప్రదేశ్లోను కూడా తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతుందని, తెలంగాణలో రాజకీయంగా ఉపయోగపడుతుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. అయితే, తెలంగాణలో ఏకపక్షంగా పొత్తు ఉండదని బీజేపీ ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్కు సహకారం చూస్తే ఇలా ఉందని వాపోయారు.

వెనక్కి తగ్గేది మాత్రం లేదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలన్న డిమాండ్పై వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎస్పీవీ ఏర్పాటు చేస్తే నిధులిస్తామని కేంద్రం చెప్పడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద ఒక లెక్క ప్రకారం రూ.1500 కోట్లే ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం చెబుతోందన్నారు. ఆ నిధులైనా ఇస్తారో ఇవ్వరో..! పోలవరం ప్రాజెక్టుకి మనం రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టామని, దాన్ని ఇవ్వాల్సి ఉందన్నారు. గట్టిగా ప్రయత్నిద్దామని, కావాలని ఆలస్యం చేస్తే అప్పుడు తమ వాదనను గట్టి వినిపిద్దామని సీఎం చంద్రబాబు చెప్పారు.

పవన్ కార్యాచరణపై నిఘా
అంతేగాక, ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి వేరే పార్టీలు వస్తాయని, రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీపై విమర్శలు చేసే వారిలో... మెత్తగా చెప్పే వారికి మెత్తగా... గట్టిగా చెప్పాల్సిన వాళ్లకు గట్టిగా బదులివ్వాలని సూచించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ కార్యాలయం ఏర్పాటు వంటి కార్యకలాపాలు ప్రారంభించారని, వారి కార్యాచరణను జాగ్రత్తగా గమనించాలని సూచించారు.

వైసీపీ కుట్రలు చేస్తోంది..
‘కుట్ర చేసే వారు చెప్పి చేయరు. వాటిని సకాలంలో గుర్తించి బయట పెట్టకపోతే మనం విఫలమవుతాం. మీరు రాజకీయనాయకుల్లా ఆలోచిస్తేనే వాటిని గ్రహించగలరు. రాష్ట్రానికి నరేంద్ర మోడీ వల్లే ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం తనకు ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక జాతీయ టీవీ ఛానల్లో చెప్పారు. దాన్ని మీరెవరూ పట్టించుకోలేదు. నా దృష్టికి వచ్చినప్పుడు... దాన్ని గట్టిగా ఎండగట్టాను...' అని సీఎం గుర్తు చేశారు. కేంద్రం నుంచి నిధులు ఆగిపోయేలా వైసీపీ నాయకులు, వారి మీడియా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినట్టు సాక్షి పత్రికలో వార్తలు రాస్తున్నారని, ఏదోలా విచారణ వేయించి పనులు ఆపేయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

నేతలకు చంద్రబాబు వార్నింగ్
మళ్లీ మళ్లీ చెప్పించుకోవద్దని, శాసనసభ సమావేశాలు ముగిసేటంత వరకు ఎవరూ ఇక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేదని, హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తగిన ముందస్తు కసరత్తుతో సభలో మాట్లాడాలని సూచించారు. గురువారం నుంచి రోజూ 10-15 మంది ఎమ్మెల్యేలు ఒక బృందంగా రియల్టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించాలని తెలిపారు.

నా బాటలో నడవండి..
తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి గురువారానికి నాలుగు దశాబ్దాలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్బంగా తెలిపారు. అంతేగాక, తాను 40 ఏళ్ల కిందట ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని, తన బాటలోనే నడిస్తే ప్రజామోదం తప్పక లభిస్తుందని చంద్రబాబు సూచించారు. నేతలు ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications