కాంగ్రెస్ చేతులు విరవండి: కిషన్, సంకినేని చేరిక
హైదరాబాద్: తెలంగాణలో 11 వందల మంది ప్రాణాలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీయే కారణమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన సమక్షంలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుతోపాటు వివిధ పార్టీలకు చెందిన నల్గొండ జిల్లా నేతలు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.
నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ చారి, యాదయ్యలు ప్రాణ త్యాగాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, సోనియానే మొదటి ముద్దాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆశ పడుతున్న కాంగ్రెస్ చేతులు విరిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంపూర్ణ తెలంగాణ బిజెపి సహకారంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు.

ఓట్లు, సీట్ల కోసం బిజెపి ఎప్పుడూ ఆశపడలేదని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ వచ్చేందుకు బిజెపి కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలని, నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కిషన్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీని ప్రధాని చేసేందుకే ఎన్నికల నగారా మోగిందని ఆయన తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు అనేక పార్టీల జెండాలు ఎగిరాయని, ఇకనుంచి కాషాయ జెండా ఎగరనుందని కిషన్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నుంచే బిజెపి ప్రభంజనం మొదలవుతుందని ఆయన అన్నారు. బిజెపికి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications