విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించం: విజయసాయి రెడ్డి, ‘గంటా’పై సెటైర్లు
న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పనిచేస్తాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు తాము అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు.
ప్రైవేట్ రంగ సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తాయని, అందుకే సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని ఆయన కోరారు. స్టీల్ ప్లాంటుకు కోకింగ్ కోల్ కొత ఉందని చెప్పిన విజయసాయిరెడ్డి.. ఆ సంస్థ సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని నిరసిస్తూ వైయస్సార్సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై పలు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు 'గంటలు' కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో సొంత 'గంట' మోగిస్తున్నారు. ఆ 'గంట'లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధి లేదు. ఆ గంట శబ్ధాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో భూ'గంట' మోగించలేదా? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఉద్దేశించినట్లుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంటును వ్యతిరేకిస్తూ ఇటీవల గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రజాప్రతిధులు కూడా రాజీనామాలు చేయాలని, ఉపఎన్నికలొస్తే టీడీపీ పోటీ పెట్టబోదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని కూడా ఇటీవల ఆయన కొట్టిపారేసిన విషయం తెలిసిందే.