ఏపీ ప్రజలకు అలర్ట్: రెండ్రోజులపాటు తీవ్రమైన ఎండలు, వడగాలులు
అమరావతి: దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. గత కొద్ది రోజులు వర్షాలతో వాతావరణం కొంత చల్లగా మారినప్పటికీ.. మళ్లీ ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తాజాగా, మరో రెండు రోజులు ఎండలు మండిపోతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

గురువారం ఏపీలోని 126 మండలాల్లో, శుక్రవారం 108 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం సమయాల్లో అవసరమైతే తప్ప బయటికి రావొద్దన్నారు.
గురువారంనాడు అల్లూరి జిల్లాలో 8, అనకాపల్లి 17, తూర్పుగోదావరి 13, ఏలూరు 4, గుంటూరు 6, కాకినాడ 11, కోనసీమ 1, కృష్ణా 6, నంద్యాల 1, ఎన్టీఆర్ 17, పల్నాడు 2, మన్యం 12, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 2, విజయనగరం 17, వైయస్సార్ జిల్లాలోని నాలుగు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications