ఉపరితల ద్రోణి ప్రభావం: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు
అమరావతి: అదరగొడుతోన్న ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించబోతోంది. నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్ దక్షిణ ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా భూ ఉపరితలానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి అవరించి ఉందని, ఫలితంగా వర్షాలు పడతాయని స్పష్టం చేశారు వాతావరణ అధికారులు. తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
దీనితోపాటు- దక్షిణ కర్ణాటక, రాయలసీమ జిల్లాలపైనా దీని ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉపరితల ద్రోణి మరింత విస్తరించడానికి అనువైన వాతావరణం ఉన్నట్లు చెబుతున్నారు. కేరళ, మాహె, లక్షద్వీప్లల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చిన తెలిపారు.
ఈ నెల 13వ తేదీ వరకు ఈ తరహా వాతావరణం కొనసాగుతుందని అంచనా వేశారు. కర్ణాటక కోస్తా తీరం, దక్షిణ ప్రాంతాలు, వాటి సరిహద్దులను ఆనుకుని ఉండే రాయలసీమ జిల్లాల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే 48 గంటల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు.
Recommended Video
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. గత రెండేళ్ల తరహాలోనే ఈ సారి కూడా నైరుతి రుతుపవనాలు సకాలంలో భారత్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రిడిక్ట్ చేశారు. జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, వాటి కదలికలు చురుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇదిలావుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు ఎండ తీవ్రత సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.