చల్లని కబురు: రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది చల్లని కబురే. ఎందుకంటే మండిపోతున్న ఎండల నుంచి రానున్న మూడు రోజులపాటు కురిసే వర్షాలతో ఉపశమనం లభించనుంది. ఈ మేరకు వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. రానున్న 3 రోజులపాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గాలుల ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో సోమవారం నుంచి మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు, రాయలసీమలోనూ సోమ, మంగళ, బుధవారాల్లో వాతావరణం పొడిగానే ఉండనుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఉత్తర కోస్తాంధ్రలో కురిసే వర్షాలతో రాష్ట్రంలో వాతావరణం కొంతమేర చల్లబడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications