AP weather: ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు, రుతుపవనాల తిరోగమనం ఎఫెక్ట్
అమరావతి: మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాల నిష్క్రమణ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈశాన్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతం మొత్తం, గోవా, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, కర్ణాటక మధ్య అరేబియా సముద్రం ఏరియాలో మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించాయి.
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఇప్పటికే ఆలస్యమైంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్ , మజలి ప్రాంతాల గుండా వెళుతుంది. అక్టోబర్ 26, 2021న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందు వల్ల నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలు ఉన్నాయి.

అక్టోబర్ 26న ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు జల్లులు పడనున్నాయి. శని, ఆది, సోమవారాల్లో యానాం, ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. శనివారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాయలసీమలో శనివారం ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. సోమవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.












Click it and Unblock the Notifications