ఏపీలో వారందరికీ సంక్షేమ పథకాలు కట్.. షాకిచ్చిన మంత్రి వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తాజాగా ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారందరికీ సంక్షేమ పథకాలను నిలిపివేసే ఆలోచనలో ఉందని వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకనైనా వారు పద్ధతిని మార్చుకుంటే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చారు.
వారికి సంక్షేమ పథకాలు కట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్న వంగలపూడి అనిత, గంజాయి కేసులో పట్టుపడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని షాకిచ్చారు. గంజాయి సాగును అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్న వంగలపూడి అనిత, గంజాయి కేసుల్లో పట్టుపడితే మాత్రం వారికి ఏపీలో సంక్షేమం కష్టమేనని తేల్చి చెప్పారు.

కేవలం ఏడాది కాలంలో 20,000 ఎకరాల నుండి 90 ఎకరాలకు వచ్చిన గంజాయి సాగు
రాష్ట్రంలో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని పేర్కొన్న హోం మంత్రి వంగలపూడి అనిత, గతంలో 20,000 ఎకరాలలో గంజాయి సాగు జరగగా కేవలం ఏడాది కాలంలో 90 ఎకరాలకు తగ్గించామని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఉపాధికి అవకాశాలు కల్పిస్తుందని, వారికి పండ్లమొక్కలు ఇవ్వాలని భావిస్తుందని తెలిపారు.
ఏడాది కాలంలో గంజాయి నిర్మూలనలో పోలీసుల పనితీరు ఇలా
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కోసం ప్రభుత్వం రెండు కోట్ల పండ్ల మొక్కలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గతేడాది కాలంలో 831 కేసుల్లో 2014 మందిని అరెస్టు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ గంజాయిపై ఉక్కు పాదం మోపారని అన్నారు. గతేడాది కాలంలో పోలీసులు 23 ,770 కిలోల గంజాయిని 27 లీటర్ల హాశిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
గంజాయి సాగును ప్రోత్సహించే వారి 7 .75 కోట్ల రూపాయల ఆస్తుల సీజ్
293 వాహనాలను సీజ్ చేసినట్టు, గంజాయి సాగును ప్రోత్సహిస్తున్న ఏడుగురికి చెందిన 7 .75 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ నిర్వహించి బృందాలతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసి 150 షాపులు మూసి వేసినట్టు తెలిపారు.
రైళ్ళలో ఈగల్ బృందాల తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న రైళ్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు పేర్కొన్న మంత్రి వంగలపూడి అనిత ఈగల్ బృందాలు రైల్వే శాఖతో కలిసి తనిఖీలు చేసి ఆరుగురిని అరెస్టు చేసి 37 కిలోల గంజాయి, 152 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అధునాతన సాంకేతికతతో గంజాయి కట్టడికి చర్యలు
ఇక గంజాయిని నిర్మూలించడంలో కీలకంగా పనిచేస్తున్న ఈగల్ విభాగానికి ఎక్సైజ్ ఆదాయంలో రెండు శాతం కేటాయించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆమె అన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ చర్యలలో భాగంగా త్వరలో డేటా సెంటర్ తో పాటు మాదకద్రవ్యాల నెట్వర్క్ ను చేదించడం కోసం అధునాతన సాంకేతికతతో పలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications