ఆ ముగ్గురు ఎవరో చెప్పండి: పవన్ వ్యాఖ్యలపై ఎస్పీ, ‘జనసేనలోకి మాజీ ఎమ్మెల్సీ’
పశ్చిమగోదావరి: తనను హత్య చేసేందుకు ముగ్గురు క్రిమినల్స్ కుట్ర పన్నుతున్నారని గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ స్పందించారు.
నన్ను చంపేయాలనుకుంటున్నారు, సీఎం కంటే ఎక్కువే అవుతా: పవన్ కళ్యాణ్ సంచలనం
ఆ ముగ్గురెవరో చెప్పండి..?
హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆ ముగ్గురెవరో చెప్పాలని, ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ రవిప్రకాశ్.. పవన్ కళ్యాణ్కు సూచించారు. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఎస్పీ తెలిపినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
భద్రత కల్పిస్తాం
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భద్రతను కూడా పెంచుతున్నామని ఆ ప్రకటనలో ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఆయన పర్యటన జరిగినన్ని రోజులు వ్యక్తిగత భద్రతతోపాటు ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అదనపు భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.
చంపేస్తారట.. ముగ్గురు క్రిమినల్స్ అంటూ పవన్
‘ముగ్గురు క్రిమినల్స్ నన్ను చంపేస్తే అసలు సమస్య ఉండదు కదా అని మాట్లాడుకున్న వాయిస్ క్లిప్ నాదాక వచ్చింది, అది ఎవరో కూడా తెలుసు, వారి పేర్లు, ముఖాలు కూడా తెలుసు. నన్ను చంపేసి అధికార, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు తోసుకుని అడ్డు తొలగించుకోవాలని.. భయపెట్టాలని చూస్తున్నారు' అని పవన్ కళ్యాణ్ గురువారం ఏలూరులో ప్రసంగించిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
జనసేనలోకి మాజీ ఎమ్మెల్సీ
ఇది ఇలా ఉండగా, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత మల్లుల లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఏలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మల్లుల పార్టీలో చేరారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మల్లుల చేరికతో ఆచంట నియోజకవర్గంలో జనసేనకు బలం లభించిందని జనసేన కార్యకర్తలు అంటున్నారు. మొదట టీడీపీలో ఉన్న మల్లులు ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు జనసేన కండువా కప్పుకున్నారు.