కేంద్రం ఏం చేస్తోంది-ఎన్ఐఏ నిద్రపోతోందా - సాయిరెడ్డి సంచలన ట్వీట్లు-అదీ తెలుగులోనే !
ఏపీలో వైసీపీకీ, కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలకూ మధ్య జరుగుతున్న పోరు పతాకస్ధాయికి చేరుకుంటోంది. అదే సమయంలో ఆయా మీడియా సంస్ధల్ని టార్గెట్ చేస్తూవైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి సహకారం లభించడం లేదు. దీంతో వైసీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ అంతకంతకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఎల్లో మీడియా ఛానళ్లు దేశద్రోహానికి పాల్పడుతున్నట్లు సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వాటిపై కేంద్రం చర్యలకు డిమాండ్ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఈసారి ఆయన కేంద్రానికే గురిపెట్టారు.

ఎల్లో మీడియాపై సాయిరెడ్డి ఆరోపణలు
ఏపీలో ఎల్లో మీడియాగా పేర్కొంటూ కొన్ని మీడియా సంస్ధలపై కొంతకాలంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడిని ఎంపిక చేయకపోవడంతో ఆయా మీడియా ఛానళ్లు దక్షిణాదికి అన్యాయం జరిగిందని, దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చాయి. ఇదే అదనుగా రంంలోకి దిగిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్రం సాయిరెడ్డి వ్యాఖ్యల్ని పట్టించుకోలేదు.

కేంద్రానికే గురిపెట్టిన సాయిరెడ్డి
ఏపీలో కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలపై తాము చేస్తున్న దేశద్రోహం ఆరోపణలను కేంద్రం పట్టించుకోకపోవడంతో వైసీపీ ఎంవీ విజయసాయిరెడ్డి ఇవాళ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియా ఛానళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే మీరేం చేస్తున్నారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. తద్వారా దేశద్రోహం కేసులు పెట్టి ఆయా మీడియా సంస్ధల్ని ఎందుకు టార్గెట్ చేయడం లేదనేలా ఆయన ప్రశ్నలు వేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్విట్ చేశారు. ఇందులో ఆయన కేంద్రంతో పాటు ఎన్ఐనీ టార్గెట్ చేశారు.

కేంద్రం, ఎన్ఐఏ నిద్రపోతున్నాయా ?
విజయసాయిరెడ్డి తన తాజా ట్వీట్ లో కేంద్రంతో పాటు ఎన్ఐఏకూ ప్రశ్నలు వేశారు. ఎల్లో కుల మీడియా యాంకర్లు, యజమాన్లు సౌత్ ఇండియా విడిపోవాలని కుట్రలు చేస్తుంటే కేంద్ర హోం శాఖ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. వాడిని కాకుండా ఆదివాసిని రాష్ట్రపతిగా ఎలా చేస్తారని విషం చిమ్మారన్నారు. దేశం తునకలు అవుతుందని వార్నింగులిచ్చారు. దీనికంటే దేశద్రోహం ఏముంటుంది. NIA నిద్రపోతోందా? అంటూ సాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందా ?
ఓవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని మీడియా సంస్ధలు చెలరేగిపోతున్నాయి. అదే సమయంలో వారిని కట్టడి చేసే విషయంలో జగన్ సర్కార్ రోజురోజుకీ నిస్సహాయంగా మారిపోతోంది. దీంతో ఇప్పటికే సీఎం జగన్ నేరుగానే తన ప్రతీ బహిరంగసభలోనూ ఎల్లో మీడియా పేరుతో విమర్శలు చేస్తున్నారు. ఇదే కోవలో సాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా ఎల్లో మీడియా పేరుతో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయినా ఫలితం లేకపోగా ఇంకా ఆయా ఛానళ్ల దాడి పెరుగుతోంది మరోవైపు కేంద్రం నుంచి ఈ విషయంలో ఎలాంటి సహకారం అందడం లేదు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి సుప్రింకోర్టు కొట్టేసిన దేశద్రోహ చట్టం కింద మీడియాపై కేసులు పెట్టాలని కోరడం ఆయన ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications