13 ఏళ్లు సీఎంగా ఉండీ.. చంద్రగిరికి ‘చంద్రం’ ఏం చేశాడు : వైఎస్ జగన్
చిత్తూరు: 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సొంతగడ్డ చంద్రగిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
శనివారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గం...
చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టింది ఈ నియోజకవర్గంలో అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. 1978లో ఇదే చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేశారని, 2 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారని, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవతో మంత్రి కూడా అయ్యారని జగన్ తెలిపారు.
ఐదేళ్లు మంత్రిగా ఉండి ఓటమి...
మంత్రి పదవిలో ఐదేళ్లు కొనసాగిన చంద్రబాబు మళ్లీ 1983లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచే బరిలోకి దిగి 17,500 ఓట్ల తేడాతో ఓడిపోయారని జగన్ చెప్పారు. కాస్తో కూస్తో సెటిల్ అయిన ప్రతిఒక్కరూ తమ సొంత ఊరికి ఏదైనా చేయాలని ఆశిస్తారని అన్నారు. విదేశాల్లో ఉన్న ఎన్నారైలు సైతం తమ సొంత గడ్డకు ఏదైనా చేయాలని తపన పడతారని, డబ్బు పంపించి అభివృద్ధికి పాటుపడతారని చెప్పారు.
13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి...
అలాంటిది 13 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు సొంత ఊరైన చంద్రగిరి ఉండాల్సిన స్థితి ఇదా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. చిన్నవయసులో చంద్రబాబు నారావారిపల్లె పక్కన ఉన్న శేషాపురం స్కూల్లో చదువుకున్నారని, ఇవాళ్టికి కూడా ఈ స్కూల్కు పిల్లలు వెళ్తున్నారని, ఇప్పుడా స్కూల్ గట్టిగా తుమ్మితే పడిపోయే దుస్థితిలో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చదువుకున్న స్కూల్ పరిస్థితే ఇలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా స్కూళ్ల పరిస్థితి ఏంటి? అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు పట్టించుకున్నారా?
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మించడం కోసం జీవోను జారీ చేశారని, ఆ తర్వాత దురదృష్టం వల్ల ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయారని వైఎస్ జగన్ చెప్పారు. అయితే వైఎస్ ఇచ్చిన జీవో ఇప్పటికీ ఉంది.. కానీ, చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
రైతులకు దమ్మిడి సాయం చేశాడా?
చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 138 పంచాయితీలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో డెబ్భై శాతం తాగునీరు కొరత ఉందని, దీన్నిబట్టి చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏటా చంద్రగిరిలోని కొన్ని మండలాల్లో ఏనుగులు బీభత్సం చేస్తూ ఉంటాయని, కనీసం ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు దమ్మిడి సాయం చేశాడా?' అని ఆయన ప్రశ్నించారు.