ఎమ్మెల్యేగా ఏం చేశావ్.. వైసీపీ ఎమ్మెల్యే కాటసానికి చేదు అనుభవం!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యే లకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు ఓ ఊరి జనమంతా షాక్ ఇస్తే తాజాగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం భూపనపాడు లో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి స్థానిక ప్రజల నుండి నిరసన సెగ తగిలింది.
వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం మండలంలోని భూపనపాడు లో పర్యటిస్తున్న క్రమంలో స్థానిక ప్రజలు ఆయనను అడ్డుకున్నారు.స్థానిక వి.సి కాలనీలోకి రావద్దంటూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని వారు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రోడ్డు కూడా వేయలేదు అని ఎమ్మెల్యేను నిలదీశారు.

ఎమ్మెల్యే కాటసాని కాలనీలోకి రావద్దంటూ రహదారిపై స్థానిక మహిళలు బైఠాయించి ఆందోళన తెలియజేయడంతో పాటుగా, ఎమ్మెల్యేగా చాలా సంవత్సరాలుగా కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించటానికి ఏం చేశారు అంటూ నిలదీశారు. ఇక మహిళలు ఎమ్మెల్యేను నిలదీయడంతో స్థానిక యువకులు వాటిని వీడియో తీశారు.
నిరసన వీడియోలు తీస్తున్న యువకుల సెల్ఫోన్లను ఎమ్మెల్యే అనుచరులు లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులకు స్థానిక యువకులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలనీవాసులు చేసిన ఆందోళనతో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
మొన్నటికి మొన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పేట అగ్రహారం గ్రామంలో పర్యటనకు వస్తున్నారని తెలిసి ఎమ్మెల్యే పర్యటన బహిష్కరించిన గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తిరిగి వెళ్లి పోయిన తర్వాతనే గ్రామం లోకి అడుగు పెడతామని వినూత్నంగా నిరసన తెలియజేశారు.
దీంతో పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించరా అంటూ మండిపడ్డారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి స్థానిక మహిళల నిరసనతో పరాభవం ఎదుర్కోవలసి వచ్చింది.












Click it and Unblock the Notifications