మీ వైఖరేంటి?, వారి భయం పోగోట్టాలి: జివోఎంలో బిజెపి
న్యూఢిల్లీ: హైదరాబాదుతో కూడిన పది జిల్లా తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని అయితే విభజనపై ముందు కాంగ్రెసు పార్టీ తమ వైఖరి చెప్పాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, హరిబాబు, నాగం జనార్ధన్ రెడ్డిలు మంగళవారం అన్నారు. మంత్రుల బృందం(జివోఎం)తో భేటీ అనంతరం వారు విలేకరులతో భేటీ అయ్యారు.
తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని కిషన్ రెడ్డి అన్నారు. అయితే సీమాంధ్ర ప్రజల భయాందోళనలను ముందు పోగొట్టాలని కోరారు. కాంగ్రెసు నేతలు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెసు వైఖరి ఏమిటో చెప్పాలని తాము జివోఎంలో ప్రశ్నించామన్నారు. 11 అంశాలపై జివోఎం ఏం చేయబోతుందో చెప్పాలన్నారు.
తాము విభజనకు కట్టుబడి ఉన్నామని, విభజన ద్వారా సీమాంధ్రలో తలెత్తే సమస్యలను కేంద్రం పరిష్కరించాలని సీమాంధ్ర బిజెపి నేత హరిబాబు అన్నారు. విధానపరంగా తీసుకున్న నిర్ణయానికి బిజెపి కట్టుబడి ఉందన్నారు. కేంద్రం ఏం చేయబోతుందో ముందు ప్రకటించాలన్నారు. అదాయ వ్యయాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని జివోఎంను కోరినట్లు చెప్పారు.
2001లో బిజెపి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు శాంతియుతంగా జరిగిందని, ఇప్పుడు కాంగ్రెసు ఆ సంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.