బీజేపీ, టీడీపీ, వైసీపీలపై జనసేనాని వైఖరేంటి? ఆవిర్భావ సభలో ఏం చెప్పబోతున్నారు?
అమరావతి: జనసేన పార్టీ స్థాపించి నాలుగేళ్లు పూర్తి కావస్తోంది. ఈనెల 14న ఆ పార్టీ ఐదో వార్షికోత్సవం జరుపుకోబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తొలిసారిగా జనసేన పార్టీ ఆవిర్భావ సభను 14న గుంటూరులో నిర్వహించబోతున్నారు.
ఇప్పటికే బీజేపీ, టీడీపీ కూటమిలో తాను లేనంటున్న పవన్ మరి ఈ నెల 14న ఏం మాట్లాడబోతున్నారు? ప్రత్యేక హోదా అంశంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని అధికార విపక్షాలపై కొంతకాలంగా వ్యతిరేక గళం వినిపిస్తున్న జనసేనాని పార్టీ ఆవిర్భావ సభలో ఎవరిపై ఎలా స్పందిస్తారో?

13 జిల్లాల నుంచి ప్రతినిధులు...
గుంటూరులో ఈనెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పెద్ద ఎత్తునే జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రజలను ఈ సభకు తరలించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం వందలాది బస్సులు ఏర్పాటు చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతినిధులు ఉండేలా చూస్తారట. ఈ ఆవిర్భావ సభకు కనీసం 5 లక్షల మంది హాజరవుతారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

ఆవిర్భావ సభలో మరింత స్పష్టంగా...
అటు బీజేపీతోపాటు ఇటు టీడీపీ, వైసీపీలపై కూడా తనదైశ శైలిలో మాట్లాడేందుకు జనసేనని పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో ఈనెల 14న జరిగే జనసేన తొలి ఆవిర్భావ సభలో ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టబోతున్నారు. ఇంకా అనేక అంశాలకు సంబంధించి పలు వర్గాల నుంచి తనకు వస్తున్న ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

అవసరమైతే న్యాయపోరాటానికీ...
2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. ప్రత్యేక హోదాతోపాటు, పలు ఇతర సమస్యల పరిష్కరంలో తనపై బాధ్యత అధికంగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విభజన హామీల అమలు కోసం న్యాయపోరాటం కూడా చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ సభలో ప్రత్యేక హోదా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, విపక్ష వైసీపీపై ఆయన ఘాటుగానే స్పందించే అవకాశమున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

2019 ఎన్నికల్లో పొత్తులపైనా స్పష్టత...
గుంటూరులో ఈనెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సభలోనే తమ పార్టీ పొత్తుల విషయమై కూడా అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు తెలిపిన జనసేనాని.. వచ్చే ఎన్నికల్లో అలాంటి అవకాశాలు ఏమీ ఉండవని, 2019 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా జనసేన సింగిల్గానే పోటీచేస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

పవన్ మాట కోసమే ఎదురుచూపులు...
పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసే ప్రకటన కోసం జనసేన నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు, పార్టీ రాజకీయ భవిష్యత్తు, బీజేపీ- టీడీపీపై పార్టీ వైఖరి, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు... ఇలా అన్ని అంశాలపైనా 14న నిర్వహించే ఆవిర్భావ సభలో పవన్కల్యాణ్ ఒక స్పష్టత ఇవ్వనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ సభపై రాజకీయవర్గాల్లో అమితాసక్తి నెలకొంది.

అలా చేస్తే, జనసేనకే నష్టం...
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మిగిలి ఉండగా, ఇప్పుడే పొత్తులు, అభ్యర్థులను ప్రకటిస్తే.. దాని వల్ల జనసేనకే నష్టం జరుగుతుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆవిర్భావ సభలో జనసేనాని గనుక ఇలాంటి ప్రకటనలే చేస్తే... ఆయా జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాలలో పోటీ రాజకీయం, అసమ్మతి రాజకీయం మొదలవుతాయని, అదేగనుక జరిగితే జనసేన పార్టీ వ్యూహమే దెబ్బతింటుందని వారు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications