ఎపిలో మిత్ర పక్షం టిడిపిపై బిజెపి ఎందుకు రెచ్చిపోతోంది? అసలు భాజాపా వ్యూహమేంటి?...
Recommended Video
ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ టిడిపికి మిత్రపక్షమైన బిజెపి ఆ పార్టీ పైనే ఎందుకు రెచ్చిపోయి విమర్శలు చేస్తోంది? అసలు ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అనుసరించాలనుకుంటున్న వ్యూహం ఏంటి? ఒక విశ్లేషణ...
ఎపిలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోందా?...భారతీయ జనతా పార్టీలోని రెండు వర్గాలు రాష్ట్రానికి సంబంధించిన అతికీలక వ్యక్తులపై ఏకకాలంలో దండెత్తడం వెనక కారణం ఏమిటి? ఇది యాదృచ్చికంగా జరిగిందా? లేక దీనివెనుక ఏమైనా వ్యూహం ఉందా? రాజకీయాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో పరిణామాలను పరిశీలిస్తే తలెత్తే ప్రశ్నలివి...ఎపిలో బిజెపి అనుసరిస్తున్న ఎత్తుగడల పై ఒక విశ్లేషణ...
ఒక వర్గం సిఎంని...మరోవర్గం గవర్నర్ ను...
ఎపిలో ఇటీవలి కాలంలో బిజెపి నేతల్లో ఒక వర్గం సిఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయగా మరో వర్గం గవర్నర్ నరసింహన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడం గమనించే ఉంటారు...దీన్నిబట్టి చూస్తే ఎపిలో భారతీయ జనతాపార్టీ రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలోని రెండు వర్గాలు ఇలా కీలక వ్యక్తులపై ఏకకాలంలో దండెత్తుతుండటంపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.
గుజరాత్ ఫలితాల తరువాత...చంద్రబాబు టార్గెట్...
నిన్నటి గుజరాత్ ఎన్నికల్లో బిజెపి విజయం తర్వాత భాజపాలోని ఒక వర్గం చంద్రబాబుపై ఒక్కసారిగా ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడింది. బిజెపి లోని ఎంఎల్సీ సోము వీర్రాజు, పురంధేశ్వరి ఇటీవల కాలంలో చంద్రబాబుపై తారాస్థాయిలో విమర్శలతో దండెత్తుతుండగా కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు అడపాదడపా గళం విప్పుతుంటారు.
సోము వీర్రాజుకు...మంత్రి మాణిక్యాలరావు తోడు
ఇక బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజైతే సిఎం చంద్రబాబును తన విమర్శలు, ఆరోపణలతో వాయించేస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితేనే రెచ్చిపోతున్నారు. అటువంటిది వీర్రాజుకు తాజాగా మంత్రి మాణిక్యాలరావు తోడయ్యారు. తన నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో, మీడియా సమావేశాల్లో టిడిపి ప్రభుత్వం, చంద్రబాబుపైన రెచ్చిపోయారు. పరోక్షంగా సిఎం చంద్రబాబుకే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసేంతవరకూ వెళ్లారు. దీనిపై టిడిపితో పాటు బిజెపిలో కూడా పెద్ద చర్చే జరుగుతోంది.
మరోవర్గం...గవర్నర్ నరసింహన్ పై...
ఇక గవర్నర్ నరసింహన్ విషయానికి వస్తే విశాఖపట్నం ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు వరుసపెట్టి గవర్నర్ పై ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్ తెలంగాణా ప్రభుత్వం తరపునే మాట్లాడుతున్నారని నేరుగా ఆరోపిస్తూ విమర్శలతో దండెత్తుతున్నారు. గవర్నర్ నరసింహన్ తన పద్దతి మార్చుకోకపోతే ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటూ విష్ణుకుమార్ రాజు హెచ్చరించడం ప్రకంపనలు రేపింది. ఇలా ఒకసారి కాకుండా ఆయన పదే పదే గవర్నర్ ను విమర్శించడం, హెచ్చరికలు జారీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల కోసం...బిజెపి వ్యూహం...
దీన్ని బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బిజెపి ఏదో వ్యూహం మొదలుపెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు శుక్రవారంప్రధాని మోడీ- సిఎం చంద్రబాబు భేటీకి ముందు బిజెపి నేతలు ఇలా రెచ్చిపోతుండటం వెనుక ఖచ్చితంగా ఒక వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో టిడిపిపై ప్రతిపక్షం వైసిపి కంటే మిత్రపక్షమైన బిజెపి తీవ్ర స్థాయిలో ఆరోపణలు,విమర్శలు చేయడం గమనార్హం. అయితే బిజెపి తమ రెండంచెల వ్యూహం వెనుక పరమార్థాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీతో భేటి అనంతరం బైటపెట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.