ముఖ్యమంత్రి జగన్ తో ఢీ అంటున్న థియేటర్ యాజమాన్యం.. MOUకు ససేమిరా!! మీరు మూసేకన్నా మేమే మూసేసుకుంటాం!!
కొవిడ్ కారణంగా చిత్రపరిశ్రమకు చెందిన థియేటర్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. రెండు సంవత్సరాలపాటు కేవలం విద్యుత్తు బిల్లులు చెల్లించుకుటూ వచ్చారు. కొవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత 50 ఆక్యుపెన్సీతో నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దానివల్ల థియేటర్లకు రోజువారీ ఖర్చులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించడంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా ఎగ్జిబిటర్లందరూ విలవిల్లాడిపోయారు.
కల్యాణమండపాలుగా మారిన థియేటర్లు
వ్యాపారం ఎలా చేయాలో ఎగ్జిబిటర్లకు అర్థం కాలేదు. కొంతమంది థియేటర్లను మూసేశారు. మరికొందరు కల్యాణమండపాలుగా మార్చుకున్నారు. కానీ సినిమాపై ప్రేమతోపాటు ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నవారిని ఆదుకోవడానికి పంటిబిగువునా థియేటర్లను నడుపుకుంటూ వస్తున్న యాజమాన్యం కూడా ఉంది.
తాజాగా ఏపీ ప్రభుత్వం ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ జరగాలని, ఆ నగదు ప్రభుత్వ ఖజానకు జమవుతాయని, ఒకరోజు తేడాతో తిరిగి చెల్లించడం జరుగుతుందని చెప్పింది. ఈమేరకు థియేటర్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది.
ఎంవోయూకు ఎవరూ ముందుకు రావడంలేదు
నిరాకరించిన థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించింది. అధికారులంతా థియేటర్లచుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం ఎంవోయూ కుదుర్చుకోవడానికి ముందుకు రావడంలేదు. ప్రభుత్వం ఒక్క రోజు విరామంతో టికెట్ల నగదును తిరిగిస్తానని చెబుతున్నప్పటికీ యాజమాన్యం మాత్రం నమ్మడంలేదు. రోజువారీ ఖర్చులే చాలా ఉంటాయని, ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా వాటిని తీసుకొని తిరిగి మాదగ్గరకు వచ్చేసరికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు. థియేటర్ల వ్యాపారాన్ని ప్రస్తుతానికి మూసేసుకుంటే మంచిదనే అభిప్రాయానికి చాలామంది ఎగ్జిబిటర్లు వచ్చేశారు.
రాబోయే రోజులు ఎలా ఉంటాయో?
బుక్ మై షో ఉండదని, నగదు ఒక్కరోజు తేడాతో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారికి నమ్మకం కుదరడంలేదు. చిత్రపరిశ్రమతో ఏపీ ప్రభుత్వానికి ఎప్పటినుంచో విభదాలు నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాకుండా ఉందంటూ వాపోతున్నారు. ఫిలిం ఛాంబర్ పెట్టిన ఒక ప్రతిపాదనను ప్రభుత్వం నిరాకరించింది. ఎంవోయూ కుదుర్చుకోకపోతుండటంతో అవసరమైతే థియేటర్లను సీజ్ చేస్తామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందని థియేటర్ యాజమాన్యం వాపోతోంది.
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో?
కాకినాడ జిల్లాలో 45, కోనసీమ జిల్లాలో 56, తూర్పుగోదావరి జిల్లాలో 33 థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్లకు సంబంధించిన నగదు మొత్తం ప్రభుత్వం దగ్గర ఉండిపోతే తామెలా వ్యాపారం చేయాలని, అందుకే వాటిని మూసేస్తున్నామంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపై మంత్రి చెల్లుబోయిన వేణుకు వినతిపత్రం కూడా అందజేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని థియేటర్ యాజమాన్యం చూపిన బాటలోనే రాష్ట్రంలోని మిగతా జిల్లాల ఎగ్జిబిటర్లందరూ నడవబోతున్నారని తెలుస్తోంది. ఏ జిల్లాలో కూడా ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో దాదాపుగా థియేటర్లన్నీ జులై ఒకటోతేదీ నుంచి మూతపడబోతున్నాయని ఫిలిం ఛాంబర్ వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల ప్రేక్షకులకు వినోదం దూరం కానుంది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.!!