ప్రత్యేక హోదాపై పోరు: పవన్ కల్యాణ్ వ్యూహమేమిటి?
హైదరాబాద్: వెనక బిజెపి ఉందా, టిడిపి ఉందా అనే సందేహాలకు తెర దించుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన రాజకీయ ఉద్దేశ్యాన్ని చాటాడు. కాకినాడలో శుక్రవారం జరిగిన సీమాంధ్ర ఆత్మగౌరవ సభలో ఆయన తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారు.
తన వెనక టిడిపి ఉందంటూ, బిజెపి ఉందంటూ వచ్చిన విమర్శలకు సమాధానమిస్తూ తన వెనక ఒకరు ఉండాలా, తనకు ఆ మాత్రం పౌరుషం, ధైర్యం లేదా అని అడిగారు. రాజకీయ పార్టీలన్నింటికీ ఆయన సవాల్ విసిరారు. మీ వల్ల కాదంటే చెప్పండి, తమ జనసేనకు వదిలేయాలని, తాము ఇక్కడే కాకినాడలో కూర్చుంటాం, కాకినాడలో కూర్చుంటామని ఆయన చెప్పారు.
ఆ రకంగా ప్రత్యేక హోదాపై బిజెపిని తూర్పారపడుతూ, రాష్ట్ర విభజనపై అటు కాంగ్రెసునూ ఇటు బిజెపినీ తప్పు పడుతూ ఆయన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఒత్తిడిలోకి నెట్టినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజనను ఆయన వ్యతిరేకిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తీరును తప్పు పట్టారు.

రాష్ట్ర విభజన తీరును తప్పు పడుతూ - రాష్ట్రాన్ని విభజించే సమయంలో పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణను కొట్టారని జనసేన ఆయన అన్నారు. లోక్సభలో తలుపులు వేసి అడ్డువచ్చిన వారిపై దాడులు చేసి రాష్ట్రాన్ని విభజించారని, అప్పట్లో అడ్డుకోబోయిన ఎంపీ నారాయణను కొట్టారన్నారు. ఈవిషయం తనను ఎంతో బాధించిందన్నారు. అలాగే భారతదేశం నా మాతృభూమి అనుకున్నానని, దానికి భంగం కలిగింది కాబట్టే ఏడ్చానని ఆయన అన్నారు.
విభజన తీరుకు బాధపడి 11 రోజులు అన్నం మానేశానని చెప్పారు. లోక్సభలో తలుపులు వేసి అడ్డువచ్చిన వారిపై దాడులు చేసి రాష్ట్రాన్ని విభజించారన్నారు. అలాగే తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రజలను చవటలు, సన్నాసులంటే బాధేస్తుందన్నారు. సీమాంధ్ర ప్రజలను ఎందుకు తిడతారని ఒక్క కాంగ్రెస్ నేతగాని, టీడీపీ నేతగాని మాట్లాడలేదన్నారు. అలాగే ప్రాణాలను పణంగా పెట్టి గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చానన్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులను కూడా ఆయన ఒత్తిడిలోకి నెట్టారు. వారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆయన కచ్చితంగా చెప్పారు. ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. వారితో కానప్పుడు మనం చూసుకుందామంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర ఆధిపత్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం కొనసాగుతుందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరాదివారికే కాదు, తమకు కూడా దేశభక్తి ఉందని, రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని ఆయన చెప్పారు.
తనకు స్పష్టమైన రాజకీయ అవగాహన ఉందని కూడా ఆయన చెప్పారు. తాను సిద్ధాంతం చదువుకున్నానని, చాలా మంది చరిత్రలు చదువుకున్నానని ఆయన అన్నారు. అలా చెప్పడం ద్వారా తాను స్పష్టమైన రాజకీయ సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.

తెలంగాణపై మనోభావాలను రెచ్చగొట్టడానికి కూడా ఆయన ప్రయత్నించారు. తనకు తెలంగాణ అంటే ఇష్టమంటూనే వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ నాయకులపై ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించకుండా ఉండాల్సిందనే అభిప్రాయం ఆయన ప్రసంగంలో వ్యక్తమైంది.
కాకినాడ సభలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే, స్పష్టమైన వ్యూహంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికలనాటికి తాను కావాల్సినంత ప్రజా మద్దతును కూడగట్టుకోవాలని ఆయన భావిస్తున్నట్లు అనుకోవచ్చు. బిజెపిపై కాస్తా ఎక్కువగా మండిపడినట్లు కనిపించినప్పటికీ చంద్రబాబుకు కూడా సవాల్ విసిరినట్లేనని భావించవచ్చు.
రెండు పాచి లడ్లు ఇచ్చారని, ఆ లడ్డూలను తీసుకుంటారా విసిరికొడుతారా అనేది చంద్రబాబు నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. అయితే, చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానిస్తున్న తరుణంలో ప్రత్యేక హోదాను వదిలేసినట్లేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపే అవకాశమే ఎక్కువగా ఉంది.












Click it and Unblock the Notifications