మొన్న టీడీపీపై శివాలు, నిన్న జగన్కు షాక్: రాజేశ్వరి దారెటు, బాబును ఒప్పించి వైసీపీకి చెక్ పెట్టేనా?
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కొద్ది రోజుల క్రితం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్లు ఆమె వెల్లడించారు.
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కొద్ది రోజుల క్రితం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్లు ఆమె వెల్లడించారు.
రాజేశ్వరి టీడీపీలో చేరడంతో ఆమె వర్గీయులు కొందరు డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె వెంట ఉన్న విలీన మండలాల వైసీపీ నాయకులు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.
డైలమాలో కేడర్
కొందరు నాయకులు ఆమెతో పాటు టీడీపీలోకి వెళ్లలేక, ఇటు వైసీపీ నాయకులు అనంతబాబు వర్గంతో ఇమడలేక ప్రస్తుతానికి వహించారని తెలుస్తోంది. రాజేశ్వరి వైసీపీలో ఉన్నప్పుడు నాయకుల మధ్య విభేదాల కారణంగా విలీన మండలాల్లో వెసీపీ రెండుగా చీలింది. రాజేశ్వరి తనకంటూ గట్టి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం
ప్రజల నాడిని పసిగట్టి తన వర్గం నాయకుల నేతృత్వంలో పోలవరం నిర్వాసితుల కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమాలు చేశారు. వైసీపీ బూత్ కమిటీల ఏర్పాటులో తన ప్రత్యర్థి వర్గం కంటే అడుగు ముందుకేశారు. తన వర్గానికి చెందిన నాయకులకే మండల నాయకత్వ బాధ్యతలు వచ్చేలా వ్యూహాన్ని రచించారు. దీంతో ఆమె వర్గం నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు.
ఊహించని షాక్, దారి తెలియక డైలమా
అలాంటి సమయంలో ఊహించని విధంగా ఆమె టీడీపీలో చేరారు. దీంతో తమ దారి ఎటో తెలియక చాలామంది డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమెతో పలువురు నాయకులు టచ్లో ఉన్నారు. కానీ ఆమెతో పాటు టీడీపీలో ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
నిన్నటి వరకు టీడీపీపై ఉద్యమించారు
అదే సమయంలో అనంతబాబు వర్గంతో కలిసి పని చేసే పరిస్థితి లేదంటున్నారు. దీంతో చాలామంది నేతలకు పాలుపోవడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఏపీలో పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.1.50 లక్షలు మాత్రమే విలీన మండలాల్లోని రైతులకుఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నష్ట పరిహారంగా ఇచ్చింది. ఇపుడు పరిహారం పది రెట్లు పెరిగింది. గతంలో పరిహారం తీసుకున్న రైతులకు కూడా పెరిగిన నష్టపరిహార రేటును ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే మొన్నటి వరకు ఉద్యమించారు. అందుకు నిర్వాసితుల నుంచి కూడా ఆమెకు పూర్థి స్థాయి మద్దతు లభించింది.
అలా చేస్తే మంచి మైలేజీ
ఇప్పుడు ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీలో చేరారు. ఒకరకంగా చెప్పాలంటే నిర్వా సితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు నేరుగా తీసుకెళ్లే అవకాశం దక్కింది. దీని వల్ల నాటి నిర్వాసతులకు ఫలితం ఉంటుందా అనే చర్చ సాగుతోంది. ఆమె కనుక అదే స్ఫూర్తితో పరిహారం సాధిస్తే ఆమెకు మంచి మైలేజీ వస్తుందని అంటున్నారు. అలా చేస్తే వైసీపీలోని తన ప్రత్యర్థికి ఎంతో కొంత చెక్ పెట్టినట్లే అంటున్నారు.