పాడిందే పాడరా.. పాచిపళ్ల దాసన్నా!!
విశాఖపట్నం రైల్వే జోన్ ను కేంద్ర ప్రభుత్వం 2019 ఫ్రిబవరి 27వ తేదీన ప్రకటించింది. అప్పటి నుంచి అది కాగితాలకు, ప్రకటనలకే పరిమితమవుతోంది. అంగుళం కూడా అడుగు ముందుకు పడటంలేదు. విభజన చట్టంలోని హామీల అమలుకు 10 సంవత్సరాల సమయం పూర్తికావస్తోంది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది.
విశాఖపట్నం జోన్ ఏర్పాటుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇప్పటికీ పరిశీలనలోనే ఉందని తెలిపింది. కొత్త జోన్ ప్రారంభానికి కచ్చితమైన సమయాన్ని చెప్పలేమంది. 2023-24 బడ్జెట్లో కొత్తగా దక్షిణకోస్తా రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం రూ.10కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు వాటి పనులకు సంబంధించి రూ.15 లక్షలు ఖర్చుచేసినట్లు పేర్కొంది. విభజన చట్టం అమల్లోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. కొత్త జోన్ ఏర్పాటుపై అప్పటి రైల్వేమంత్రి పియూష్ గోయల్ ప్రకటన చేసి నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా రైల్వే శాఖ మాత్రం నింపాదిగా, తీరుబడిగా డీపీఆర్ ను పరిశీలిస్తున్నట్లు మాత్రమే చెబుతోంది.

విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుంచి హైదరాబాద్తో పాటు, తెలంగాణలోని ఇతర ముఖ్యనగరాలకు ర్యాపిడ్ రైల్, రోడ్డు అనుసంధానానికి విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు మధ్య 942 కిలోమీటర్లమేర కొత్త రైల్వేలైన్ నిర్మించేందుకు ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిపాదిత మార్గంలో రైళ్లు 220 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. దీనికి ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీనే రైల్వే బోర్డు ఆమోదించింది. దీనికి సంబంధించిన టెండర్లను తెరిచామని, సర్వే పనులు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఎంత ఖర్చవుతుందనేది సర్వే తర్వాతే తెలుస్తుందని చెప్పింది.












Click it and Unblock the Notifications