తప్పు ఓటర్లదా .. రాజకీయ పార్టీలదా ? పవన్ ఏమంటున్నారు ?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావడం ఖాయం అని అంతా భావించారు కానీ అది సాధ్య పడలేదు. మార్పు కోరుకున్న పవన్ పార్టీ ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న తనను ఓడించడానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇక తాజాగా మరో సంచలన ఆరోపణలు చేశారు. అది కూడా ప్రజల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతున్నాయి.
బాబు ..మౌనీ బాబా అయ్యారు.. జగన్ క్యాబినెట్ పై చంద్రబాబు మాట్లాడరేం
పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఓటర్లపై పవన్ మాటల దాడి
సహజంగా ఎవరైనా ఓటర్లను దేవుళ్ళుగా భావిస్తారు. వాళ్ళు ఎలా ఓటేసినా దానికి గౌరవం ఇస్తారు . పొరబాటున కూడా ఓటర్లను అవమానించే ధోరణిలో ఏ పార్టీ నాయకులు మాట్లాడారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటు అమ్ముకునే కంటే వీధుల్లో బిక్షాటన చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రజలను షాక్ కు గురి చేస్తున్నాయి . ఇక రాష్ట్రంలో ఈ దఫా అధికారంలోకి వస్తామని భావించి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన టీడీపీ సైతం ప్రజా తీర్పు శిరోధార్యం అని, ఓటరు దేవుళ్ళకు నమస్కారం పెట్టి సైలెంట్ గా ఉంటె పవన్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఏది అనిపిస్తే అది చెప్పేస్తున్నారు. మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో పాటు, ఓటర్లను కలుసుకున్న పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల వైఫల్యం గురించి, జనసేన పార్టీ ఓటమి గురించి విస్తృతంగా చర్చించారు .ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటును అమ్ముకునే వారికంటే వీధుల్లో అడుక్కుతినే వారు ఎక్కువ సంపాదిస్తారు అంటూ వ్యాఖ్యానించారు.
తప్పెవరిది ? డబ్బు తీసుకుని ఓట్లు వేసే ప్రజలదా ? ప్రలోభపెట్టే పార్టీలదా?
పార్టీ కార్యకర్తల తోనూ, ఓటర్లతోను మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలు ఒక ఓటు కోసం ఎంత డబ్బు ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో వారు ఓటుకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చారంటూ సమాధానమిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ రాబోయే ఐదు సంవత్సరాలలో అన్ని రోజులకు కలిపి రెండు వేల రూపాయలను విభజిస్తే వారికి రోజుకు ఒక రూపాయి పడుతుందని లెక్క చెప్పారు. ఎందుకంటే రెండు వేల రూపాయలు తీసుకొని ఓటేసి గెలిపించిన నాయకులు ఐదు సంవత్సరాల పాటు పాలన సాగిస్తున్నారు కాబట్టి పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
రెండు వేల రూపాయలకు ఓటును విక్రయించిన ప్రజల కంటే, వీధుల్లో బిక్షాటన చేసిన వారు చాలా ఎక్కువ సంపాదిస్తారు అంటూ ఆయన కార్యకర్తలతో అన్నారు. ఓటర్లను ఇలా అవమానకర రీతిలో మాట్లాడటం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎన్నికల్లో ధన ప్రవాహంఉంటుందని తెలిసినా , డబ్బుకు , మద్యానికి ప్రలోభపడి ఓట్లేసే ఓటర్లు ఉంటారని తెలిసినా ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ ప్రజల తప్పును ఎత్తి చూపదు. ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించదు . పవన్ వ్యాఖ్యలతో అసలు తప్పు డబ్బు తీసుకుని ఓట్లు వేసే ప్రజలదా ? ప్రజలను ప్రలోభపెట్టే పార్టీలదా ? అన్న చర్చ మొదలైంది .
ఓటర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ ను ఓటర్లు ఆదరిస్తారా ?
ఇక తాను రాజకీయాలను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకు తన భుజస్కంధాలపై పార్టీ బాధ్యతలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. అందరూ పార్టీని వదిలి వెళ్ళిన ఒంటరిగానైనా తన పోరాటాన్ని సాగిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు ఎందుకు చెయ్యదో చూస్తానన్న ఆయన తన పోరాట మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ఇక నుండి రాజకీయ వ్యూహాలపై కూడా పవన్ దృష్టి కేంద్రీకరించినట్లు గా పేర్కొన్నారు. ఇలా ఓటర్లపై వ్యాఖ్యలు చేసిన పవన్ ప్రజా క్షేత్రంలో ముందు ముందు ప్రజల నుండి ఎలాంటి ఆదరణ పొందుతారో వేచి చూడాలి. ఇప్పటికే పవన్ పార్టీని వీడి నేతలు జంప్ అవుతున్న వేళ పవన్ అలోచించి మాట్లాడకుంటే జనసేనకు ప్రజలు ఝలక్ ఇవ్వటం ఖాయం .