చంద్రబాబు Vs జగన్ - పీఏసీ ఛైర్మన్ దక్కేదెవరికి, బిగ్ ట్విస్ట్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్ పదవి ఎన్నిక కూటమి - వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ పదవికి సంబంధించి ఈ మధ్నాహ్నం వరకు నామినేషన్లకు సమయం ఉంది. సంఖ్య పరంగా వైసీపీకి ఈ పదవి దక్కదు. కానీ, ప్రతిపక్షానికే ఈ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. అయితే, మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలంతో పోటీ చేయాలని వైసీపీ భావిస్తోంది. అనూహ్య నిర్ణయాలు జరిగితే మినహా ఈ పదవి వైసీపీకి దక్కే ఛాన్స్ లేదు. దీంతో, ఈ ఎన్నికలో చోటు చేసుకునే పరిణామాల పై ఉత్కంఠ కొనసాగుతోంది.
వైసీపీకి లేనట్లేనా
కీలకంగా భావించే ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి సహజంగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయిస్తారు. కానీ, ఇప్పుడు వైసీపీకి ఆ పదవి దక్కే ఛాన్స్ కనిపించటం లేదు. ఛైర్మన్ పదవితో పాటుగా సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పదవుల కోసం నేడు (గురువారం) మధ్నాహ్నం లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏకగ్రీవం కాకుండా.. పోటీ ఉంటే రేపు (శుక్రవారం) ఎన్నిక జరగనుంది. ఎన్నిక జరిగితే సభలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా కూటమికే ప్రధాన పోస్టులు దక్కే అవకాశం కనిపిస్తోంది.

జనసేనకు దక్కేనా
దాదాపు 60 ఏళ్లుగా పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి దక్కుతోంది. 2019లో టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్న సమయంలో.. పీఏసీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. పీఏసీ తో పాటు ఇతర కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి తరపున మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో, మండలిలో లోకేష్ తీర్మానం ప్రవేశపెట్టారు. మండలి నుంచి ప్రతి కమిటీకి ముగ్గురు సభ్యులను ఎన్నుకునేందుకు వీలుగా రూల్ 263 ద్వారా తీర్మానం ప్రవేశపెడు తున్నట్టు తెలిపారు. అయితే, వైసీపీ ఈ ఎన్నిక సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టిడిపి కాకుండా ఎక్కువ స్థానాలు ఉన్న జనసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని, అందువల్ల అనవాయితీ ప్రకారం ఈపదవి వైసిపికి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
వైసీపీ పోటీ చేసినా
మండలిలో వైసీపీకి సంఖ్య పరంగా బలం ఉండటంతో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ, ప్రజా పద్దుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారు. శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి ముగ్గురు సభ్యులుగా నియమితులవుతారు. గత శాసనసభలో టీడీపీకి ఒక్క సభ్యుడినే ఎన్నుకొనే అవకాశం ఉండటంతో కేశవ్ కు అవకాశం దక్కింది. ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం ఉంది. అయితే, మండలి సభ్యుడికి పీఏసీ ఛైర్మన్ గా ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చర్చగా మారింది. శాసనసభలో వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఆ పార్టీకి పీఏసీ ఛైర్మన్ పదవి దక్కదనేది కూటమి నేతల వాదన. దీంతో, జనసేనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక.. ఇప్పుడు పీఏసీ ఛైర్మన్, సభ్యుల విషయంలో ఎలాంటి రాజకీయం చోటు చేసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications