హైద్రాబాద్ ఉండగా: బొత్స, రాజధానిపై సస్పెన్స్ వీడినట్లే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటు అయ్యే వరకు విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఇప్పటికే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కు తాత్కాలిక రాజధానగా ఉందని, ఇలాంటి సమయంలో మరో తాత్కాలిక రాజధాని ఎందుకని ఆయన ప్రశ్నించారు. విభజన నేపథ్యంలో హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండనున్న విషయం తెలిసిందే.
కాగా, రాజధాని పైన సస్పెన్స్ క్రమంగా వీడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘విజయవాడ-గుంటూరు' మధ్యే రాజధాని వస్తుందన్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలతో, పూర్తిస్థాయిలో రాజధాని ఏర్పాటు చేసుకునేలోగా... విజయవాడను తాత్కాలిక పరిపాలనా కేంద్రంగా మార్చి, మెల్లమెల్లగా పరిపాలనను అక్కడికే తరలించే దిశగా అడుగులు పడుతున్నాయి.
కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోగా... తాత్కాలికంగా విజయవాడ నుంచి పరిపాలన కొనసాగించాలనే నిర్ణయం దాదాపుగా జరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వివిధ విభాగాల అధిపతుల (హెచ్వోడీ) కార్యాలయాలను క్రమంగా విజయవాడకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అటూ ఇటుగా సుమారు 150 ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడ నుంచి తాత్కాలికంగా పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.
మునిసిపల్ శాఖమంత్రి పి.నారాయణ తదితరులతో రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. సమాచారం మేరకు.. కొత్త రాజధానిగా విజయవాడ బాగుంటుందని, దీని గురించి ఆలోచించించాలని చంద్రబాబుకు పలువురు సూచించారు. ఇప్పుడు, విజయవాడను తాత్కాలికంగా రాజధానిగా చెబుతుండటంతో.. క్రమంగా అదే శాశ్వత రాజధాని అవుతుందని పలువురు భావిస్తున్నారు.