మోడీకి థ్యాంక్స్కు జగన్ దూరం, రౌడీయిజం నడవదని బాబు, సభలో గందరగోళం
ఏపీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం, పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది.
అమరావతి: ఏపీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం, పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది.
ఏపీ శాసన సభలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు. తొలుత చంద్రబాబు మాట్లాడారు. అనంతరం వైసిపి అధినేత జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా గందరగోళం చోటు చేసుకుంది. కాగా, కేంద్రానికి ధన్యవాదాలు చేసే తీర్మానానికి వైసిపి ఆమోదం తెలపలేదు. అనంతరం సభ వాయిదా పడింది.
చంద్రబాబు ఒక్కరూపాయి ఇవ్వలేదు.. జగన్
గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం ప్రాజెక్టుకు ఒక్కరూపాయి కేటాయించలేదని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక ఖర్చు పెట్టింది కేవలం రూ.3వేల కోట్లు అన్నారు.
చంద్రబాబు సీఎం కాకముందు, పోలవరం జాతీయ ప్రాజెక్టు కాకముందే వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించిందని జగన్ చెప్పారు. రాష్ట్రం కోసం 56సార్లు కేంద్ర ప్రముఖులను కలిశానని చెప్పారు.
ఆర్థిక సంఘం చెప్పిందని ప్రచారం.. జగన్
ప్రత్యేక హోదా వద్దని ఆర్థిక సంఘం చెప్పిందని చంద్రబాబు బోగస్ ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని 14వ ఆర్థిక సంఘం మీదకు నెట్టి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రత్యేక హోదా.. ఇంకా ఎన్నో ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ఇప్పుడు హోదా పైన కేంద్రం యూటర్న్ తీసుకుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం కోసం ఏడు మండలాలు తానే తెచ్చానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే పకేంద్రానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుతారని జగన్ ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి చొరవతోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పారు. పోలవరం వైయస్ కల అన్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి పనులు అప్పగించారన్నారు.
కిరణ్ సర్కార్ను కాపాడి.. తెలుగు కాంగ్రెస్గా..
చంద్రబాబు నాయుడుకు పోలవరంపై సరైన ధ్యాస లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు సొంతం అయినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మూడేళ్ల కాలంలో కేవలం రూ.3,300 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు అవిశ్వాస తీర్మానం సమయంలో టిడిపి మద్దతిచ్చిందని, అది తెలుగు కాంగ్రెస్ సర్కార్ అని జగన్ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం సమయంలో కిరణ్ సర్కారును కాపాడారన్నారు.
రౌడీయిజం చెల్లదు.. చంద్రబాబు
జగన్ వ్యాఖ్యల పైన చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించారు. వైసిపి నేతలు నిలబడి.. వీ వాంట్ జస్టిస్ అని డిమాండ్ చేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఇక్కడ రౌడీయిజం నడవదన్నారు. అది గుర్తు పెట్టుకోవాలన్నారు.
అసభ్యంగా మాట్లాడి, యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసిపి చూస్తోందని చంద్రబాబు ఆగ్రహించారు. అది మీకు బూమరాంగ్ అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు.రాష్ట్రం కోసం 56సార్లు కేంద్ర ప్రముఖులను కలిశానని చెప్పారు.
గందరగోళం
ఓ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. జగన్ మాట్లాడుతూ.. హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని సీఎంను ప్రశ్నించారు. కేంద్రం ఏది చెబితే దానికి చంద్రబాబు ఓకే అంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తానా అంటే చంద్రబాబు తందానా అంటున్నారని ఆరోపించారు.
జగన్కు మాట్లాడే అవకాశం రాక..
ప్రత్యేక హోదా అంశం ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. సమయం మించి పోతుండడంతో జగన్కు మాట్లాడే అవకాశం దక్కలేదు. దానిపై సమాధానం చెప్పాల్సిందిగా చంద్రబాబుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు.
అయితే, స్పీకర్ తమకు సమయం ఇవ్వడం లేదని వీ వాంట్ జస్టిస్ నినాదాలు చేస్తూ వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్యే హోదా అంశంపై జగన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు జవాబిచ్చారు.