రూటు మార్చిన చంద్రబాబు ? స్కిల్ తప్ప మిగతా కేసుల్లో బెయిల్ ప్రయత్నాలు ! రీజన్ ఇదేనా ?
ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు వారాల రిమాండ్ కు పంపింది. అయితే రిమాండ్ కు పంపగానే ఈ కేసులో బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. కానీ ఇతరత్రా కేసుల్లో మాత్రం ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన న్యాయవాదులు పిటిషన్లు వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును రిమాండ్ కు పంపాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ తో ఏకీభవిస్తూ కోర్టు ఆయన్ను జైలుకు పంపింది. అయితే వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ ఆయన అలా చేయలేదు. అలాగే సీఐడీ అరెస్టుకు ఇచ్చిన నోటీసులోనూ తాము స్టేషన్ బెయిల్ ఇవ్వలేమని, కాబట్టి కోర్టులో బెయిల్ తీసుకోవచ్చని సూచించింది. అయినా చంద్రబాబు మాత్రం బెయిల్ కు మొగ్గు చూపలేదు. ఏసీబీ కోర్టులో, హైకోర్టులో ఆయన లాయర్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తారని భావించినా అలా జరగడం లేదు.

అదే సమయంలో చంద్రబాబును పీటీ వారెంట్ పై తీసుకొచ్చి విచారించేందుకు సీఐడీ ప్రయత్నిస్తున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అలాగే పుంగనూరులోని అంగళ్లులో హింసకు ప్రేరేపించారనే కేసులో మాత్రం చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అసలు కేసును వదిలిపెట్టి ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేస్తున్న పిటిషన్లు చర్చనీయాంశమవుతున్నాయి.
చంద్రబాబు ఇలా స్కిల్ కేసులో బెయిల్ తీసుకోకుండా మిగతా కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేస్తున్న పిటిషన్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఏకంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్, రిమాండ్ ను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే అంతకుముందే ఇదే కేసులో బెయిల్ కోసం ఆశ్రయించే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. కానీ సీఐడీ మాత్రం ఆయన్ను స్కిల్ కేసులో కస్టడీకి ఇవ్వమంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. దీంతో కస్టడీ పిటిషన్ పై విచారణ జరగకుండా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.

ఇలా స్కిల్ కేసులో బెయిల్ తీసుకోకుండా చంద్రబాబు కాలయాపన చేయడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. స్కిల్ కేసులో తాను నిర్దోషిగా భావిస్తున్న చంద్రబాబు.. ఇందులో బెయిల్ తీసుకుంటే గతంలోలా స్టేలు, బెయిల్ తెచ్చుకునే విమర్శల పాలవ్వాల్సి ఉంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏకంగా తనపై దాఖలు చేసిన కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు అర్ధమవుతోంది. ఆలోపు సీఐడీ కస్టడీకి ఇవ్వకుండా మాత్రం ఆదేశాలు పొందారు.
అదే సమయంలో స్కిల్ కేసు రిమాండ్ ఖైదీగా ఉండగానే మిగతా కేసుల్లో తనను పీటీ వారెంట్ పై అరెస్టు చేసి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సీఐడీ చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ గానే ముందస్తు బెయిల్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసుల్లో ఇప్పటివరకూ చంద్రబాబు మినహా మిగిలిన వారికి ముందస్తు బెయిల్ ఎలాగో వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ముందస్తు బెయిల్ అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications