సీక్రెట్గా 'జగన్ హైదరాబాద్కు.. ఆ కేసు భయం పట్టుకుందా?.. వర్ల సెటైర్
ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ రహస్య పర్యటనకు కారణమేంటని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ హఠాత్తుగా హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. సోదరి సునీతను కలిసి రిట్ పిటిషన్పై చర్చించడానికి వెళ్తున్నారా.. లేక పిటిషన్ను ఉపసంహరించుకునేలా చేసేందుకు వెళ్తున్నారా అని ప్రశ్నలు గుప్పించారు. సునీత కోరినట్టు వైఎస్ వివేకానంద హత్యపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలుబటపడుతాయన్న భయమా అని ప్రశ్నించారు. ఎవరిని అరెస్ట్ చేస్తారని అంతలా భయపడుతున్నారన్నారు.

అప్పుడు సిట్పై నమ్మకం లేదని.. ఇప్పుడేమో..
వివేకానంద హత్య కేసులో జగన్ గతంలో సీబీఐ విచారణ కోరలేదా అని వర్ల ప్రశ్నించారు. మరి ఇప్పుడెందుకు విచారణలో జాప్యం చేస్తున్నారని నిలదీశారు. సీఎం హోదాలో కేసుపై సీబీఐతో విచారణ జరిపిస్తారని ఇన్నాళ్లు ఎదురుచూశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిట్పై నమ్మకం లేదన్న జగన్.. సీఎం అయ్యాక వివేకా హత్యపై సిట్తో విచారణ జరిపిస్తున్నారని అన్నారు.

సీబీఐతో విచారణ జరిపించాలన్న వర్ల..
గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదని జగన్ పదేపదే వ్యాఖ్యానించలేదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. గతంలో నమమకం లేదన్న పోలీసులే ఇప్పుడు జగన్కు ఆత్మీయులుగా మారారా అన్నారు. రిట్ పిటిషన్లో వివేకా సోదరి సునీత అనుమానితుల జాబితా దాఖలు చేశారని.. అందుకే సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయపడుతాయని జగన్ భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా హత్య కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

హైకోర్టులో వివేకా కుమార్తె పిటిషన్..
కాగా,వివేకా హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐతో విచారణ జరిపించడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని కోర్టు ప్రశ్నించింది. ఇదే కేసుపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కూడా పిటిషన్ దాఖలు చేశారని గుర్తుచేసింది. అయితే ప్రభుత్వం తరుపున బదులిచ్చేందుకు అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.

హైదరాబాద్కు జగన్..
ఇదిలా ఉంటే, బుధవారం మధ్యాహ్నం జగన్ హైదరాబాద్ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్ చేరుకునే ఆయన.. లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి.. గురువారం ఉదయం హైదరాబాద్లో జరిగే ఓ వివాహానికి హాజరవుతారు. తిరిగి సాయంత్రానికి గన్నవరం చేరుకుని,నేరుగా తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications