'కేంద్రమంత్రిగా చిరంజీవి ఏం చేశారు': ముద్రగడ తగ్గే ఛాన్స్, బీసీ సంఘాల అల్టిమేటం
విజయవాడ: కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు కిర్లంపూడి వెళ్తామన్న కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డిల పైన మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు ముద్రగడను పరామర్శించే నైతిక హక్కు లేదన్నారు.
వారు అధికారంలో ఉన్నప్పుడు కాపుల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. 2008లో సర్వే కోసం రూ.40 లక్షలు అడిగితే రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కాపులకు చంద్రబాబు న్యాయం చేస్తారన్నారు. కేంద్రమంత్రిగా చిరంజీవి కాపులకు ఎందుకు కోటా సాధించలేదన్నారు.
కిర్లంపూడి వెళ్లనీయడం లేదు: హెచ్చార్సీకి కాంగ్రెస్
ముద్రగడను పరామర్శించేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ఏపీ మానవ హక్కుల సంఘానికి ఆదివారం ఫిర్యాదు చేశారు. ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ తదితరులు ఏపీ మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను ఆయన నివాసంలో కలిశారు.
ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లే నేతలను అడ్డుకొంటున్న ఏపీ ప్రభుత్వ చర్యలను నిరోధించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ.. సోమవారం తాను, ఎంపీ చిరంజీవి రాజమండ్రి మీదుగా కిర్లంపూడి వెళ్లనున్నట్లు చెప్పారు.
తమను హైదరాబాద్లోనే గృహ నిర్భందం చేసేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు బయల్దేరినట్లు సమాచారం వచ్చిందన్నారు. తమకు హెచ్చార్సీ అనుమతి ఇచ్చిందన్నారు.
చంద్రబాబుకు బీసీ సంఘాల హెచ్చరిక
కాపులను బీసీ జాబితాలో చేర్చరాదని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం 72 గంటల్లోపు ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
ఆదివారం తిరుపతిలో ఆయన అధ్యక్షతన రిజర్వేషన్ వర్గాల రాష్ట్రస్థాయి రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన రాష్ట్రస్థాయి నాయకులు హాజరై కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీ జాబితాలో చేర్చే నిర్ణయాన్ని 72 గంటల్లోపు ప్రభుత్వం ఉపసంహరించుకుని ప్రకటన వెలువరించాలన్నారు.
లేదంటే 72 గంటల అనంతరం విశాఖపట్నం వేదికగా రాష్ట్ర బీసీ కులాల సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులు దుర్వారపు రామారావు, విజయవాడ కేంద్రంగా బీసీ ఉద్యమకారులు వై కోటేశ్వరరావు, తిరుపతి కేంద్రంగా యాదవ ఉద్యమకర్త అన్నా రామచంద్రయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు.
ముద్రగడ దీక్ష విరమించే అవకాశం
కాపుల రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం సోమవారం ఉదయం వైద్య పరీక్షలకు నిరాకరించారు. ఆదివారం రాత్రి ఆయనతో తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర రామారావులు చర్చించారు. నేడు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు చర్చిస్తారు. ముద్రగడ దీక్ష విరమించే అవకాశముందని అంటున్నారు.