ఇన్ఫోసిస్, ఐబీఎం అందుకే సీమకు రావట్లేదు, జగన్ ఫోటో అంటున్నారు కానీ: పవన్ కళ్యాణ్ షాకింగ్
రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇది వైసీపీ అధినేత ఇలాకా. కాబట్టి ఆయనను ప్రధానంగా టార్గెట్ చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
రైల్వేకోడూరు, రాజంపేటలు జనసేనవే కావాలి
వచ్చే ఎన్నికల్లో రైల్వేకోడూరు జనసేనది కావాలని, రాజంపేట పార్లమెంట్ స్థానం కూడా మనదే కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. నాయకుల పల్లకీ మీరు మోసింది చాలునని, మీ పల్లకి ఇక నేను మోస్తానని చెప్పారు. తాను ఎవరి జోలికి వెళ్లే వ్యక్తిని కాదని, లక్ష రూపాయలతో మొదలైన తాను ఇరవై కోట్లు ట్యాక్స్ కట్టే స్థాయికి ఎదిగానని, అది తనకు మీరు ఇచ్చిన వరమని, ఇప్పుడు నేను మీకు అండగా నిలబడటానికి వచ్చానని, ప్రాణం పోయినా మాట మీదే నిలబడి ఉంటానని చెప్పారు. ఇక్కడ ఉన్న నా రాయలసీమ యువతకి చెబుతున్నా మీకు ఉద్యోగాలు వచ్చేలా పని చేస్తానని అన్నారు.
అందుకే ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు
మీ కోసం కూలి పని చెయ్యడానికి కూడా నేను సిద్ధమని, కష్టపడి పైకి వచ్చినోడినని పవన్ కళ్యాణ్ అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేల రాయలసీమ అన్నారు. కానీ కొన్నికుటుంబాలు ఈ సీమకు చెడ్డపేరు తీసుకు వచ్చాయని, రాయలసీమ అనేది చదువుల నేల అన్నారు. లక్ష కోట్లు దోచుకున్న రాయలసీమ వ్యక్తులు అనే స్థాయి నుంచి రాయలసీమకు లక్ష ఉద్యోగాలు కల్పించే స్థాయికి జనసేన తీసుకువస్తుందన్నారు. ప్రతిపక్షం నలభై శాతం, అధికార పక్షం అరవై శాతం అని వాటాలు అడుగుతారని, అందుకే ఇక్కడ ఉద్యోగాలు రావడం లేదని చెప్పారు. అందుకే పరిశ్రమల స్థాపన జరగట్లేదన్నారు.
ఇన్ఫోసిస్, ఐబీఎం సీమకు అందుకే రావట్లేదు
ఇన్ఫోసిస్, ఐబీఎం లాంటి ప్రముఖ సంస్థలు రాయలసీమలో పెట్టుబడులు పెట్టకపోవడానికి కారణం ఇక్కడి నాయకులు వారిని వాటాలు అడగడమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఏ అభివృద్ధి జరగలేదని, ఒకసారి తనను ముఖ్యమంత్రిని చేయండి అభివృద్ధి అంటే ఏమిటో, మీకు ఒక రాయలసీమ ఊరి పేరును ఇంటిపేరుగా మార్చుకున్న రాయలసీమ బిడ్డగా చేసి చూపిస్తానని అన్నారు.
జగన్ తన ఫోటో పెట్టుకునేలా పాలిస్తానని చెబుతున్నారు
జగన్ తన ఫోటో మీ ఇంట్లో ఉండేలా పరిపాలిస్తానని అంటున్నారని, నేను జగన్లా సొంత స్వార్ధం గురించి రాలేదని, మీరు అందరూ బాగుండాలని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరు ఎంత బలం ఇస్తే అంతే బలంగా నేను చట్ట సభలోకి వెళ్తానని చెప్పారు. ఆడపిల్లలు క్షేమంగా ఉండటానికి బలమైన చట్టాలు తీసుకొస్తానని, బలమైన పోలీసు వ్యవస్థను తీసుకొస్తానని చెప్పారు. మొన్న అదోనీలో ప్రభుత్వ కళాశాల గురించి మాట్లాడితే ఈ రోజు ఆ సమస్య తీరిందని, అది జనసేన బలం అన్నారు. మీరు జనసేనతో నడవండని, జనసేనకి ఓటు వెయ్యండని, మీ సమస్యలను తన ఇంటి సమస్యలుగా భావించి మీ తరపున బలంగా పోరాడుతానని చెప్పారు.