బాబాయ్ కి జగన్ మరో ఛాన్స్-పార్టీలో గట్టిపోటీయే కలిసొచ్చిందా ? ఆ నిర్ణయం వెనుక..
ఏపీలో తాజాగా ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల పంపకాల్లో సీఎం జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని మరోసారి టీడీడీ ఛైర్మన్ పోస్టుకు ఎంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం వైసీపీలో పలువురు పోటీ పడుతుండటం, రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవి కోసం వైవీ సుబ్బారెడ్డి ఎదురుచూస్తుండటం వంటి కారణాల నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ పోస్టు ఎంపిక కీలకంగా మారింది. అయితే పలు కారణాలతో జగన్ కు ఈ పోస్టు ఎంపికలో బాబాయ్ మినహా మరో ఆప్షన్ లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
టీటీడీ ఛైర్మన్ గా వైవీకి మరో ఛాన్స్
దేశంలో అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టు భోర్డు ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి ఎంపికయ్యారు. ఇప్పటికే ఓసారి టీటీడీ బాధ్యతలు నిర్వర్తించిన సుబ్బారెడ్డికి సీఎం జగన్ మరోసారి అవకాశం కల్పించారు. ఆయన పదవీకాలం ముగియడంతో తిరిగి పగ్గాలు ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా చోటు చేసుకున్న పలు పరిణామాలు ఆయన్ను మరోసారి టీటీడీ ఛైర్మన్ పోస్టుకు ఎంపికయ్యేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
టీటీడీ ఛైర్మన్ కోసం వైసీపీలో గట్టిపోటీ
ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి కోసం వైసీపీలో ఈసారి తీవ్రపోటీ నెలకొంది. గతంలో ఓసారి వైవీ సుబ్బారెడ్డి పనిచేయడం, ఆయన స్ధానంలో మరొకరికి అవకాశం కల్పించాలని సీఎం జగన్ తొలుత భావించడంతో పలువురు సీనియర్ నేతలు తెరపైకి వచ్చారు. ఇందులో నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మరికొందరు రాయలసీమ నేతలు ఉన్నారు. కోస్తా నుంచి కూడా టీటీడీ ఛైర్మన్ పోస్టు కోసం ప్రభుత్వం వద్దకు పలు ప్రతిపాదనలు పెళ్లినట్లు తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం బాబాయ్ సుబ్బారెడ్డి వైపే మొగ్గు చూపారు.
రాజ్యసభ లేదా మంత్రి పదవిపై వైవీ కన్ను ?
ఓసారి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించిన వైవీ సుబ్బారెడ్డి.. తన పదవీకాలం ముగిశాక రాజ్యసభ ఎంపీ లేదా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. తిరిగి రాజకీయాల్లోకి వస్తానని తాజాగా ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా కూడా తన అనుచరుల్ని పిలిపించి మీటింగ్ పెట్టి మరీ వైవీ చెప్పుకున్నారు. గతంలో అబ్బాయ్ జగన్ చెప్పారని ఒంగోలు ఎంపీ అభ్యర్ధిత్వాన్ని మాగుంట శ్రీనివాసులరెడ్డి కోసం వదులుకున్న బాబాయ్ కి రాజ్యసభ హామీ లభించింది. దీంతో ఆయన అప్పటి నుంచి రాజ్యసభ ఎంపీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వచ్చే ఏడాది వరకూ రాజ్యసభ ఎంపీ పదవులు వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఎమ్మెల్సీ పోస్టు తీసుకుని మంత్రివర్గంలో చేరాలని కూడా ఆయన భావించారు. దీంతో ఓ దశలో జగన్ కూడా టీటీడీ ఛైర్మన్ గా మరొకరిని తీసుకోవాలని భావించారు.
టీటీడీ ఛైర్మన్ గా వైవీనే ఎందుకంటే ?
టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పార్టీలో పలువురు పోటీ పడుతుండటం, అటు బాబాయ్ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ లేదా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో జగన్ కు టీటీడీ ఛైర్మన్ ఎంపిక కీలకంగా మారింది. అయితే టీటీడీ ఛైర్మన్ గా పోటీ పడుతున్న వారిలో మేకపాటి, భూమన వంటి సన్నిహితులు ఉన్నప్పటికీ వారిలో ఒకరిని కాదని మరొకరికి ఈ ప్రతిష్టాత్మక పదవి కట్టబెడితే వ్యతిరేకత వస్తుందని జగన్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే తిరిగి బాబాయ్ నే ఒప్పించి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అసలే టీటీడీలో వివాదాలు పెరిగిపోతుండటం, మరొకరికి ఇస్తే వారు ఆ వివాదాలను తట్టుకోగలరా లేదా అన్న అనుమానాలతో బాబాయ్ వైపే జగన్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.